లండన్: భారత్-ఇంగ్లండ్ జట్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లో ఇటీవలే ముగిసిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ను కారణంగా చూపుతూ ఇరు జట్లకు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించింది. అంతేగాక రెండు జట్లకు లభించిన నాలుగు పాయింట్లలో చెరో రెండు పాయింట్లనూ కోత పెట్టింది. నిర్దేశించిన దానికంటే రెండు ఓవర్లు తక్కువగా వేశారని ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ రెండు జట్లపై జరిమానా విధించారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)-2లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్లో ఇరు జట్ల పాయింట్లకు కోతపెట్టడం జట్టు ఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపనుంది. గెలిస్తే 12 పాయింట్లు, మ్యాచ్ టై అయితే 6 పాయింట్లు, డ్రా అయితే 4 పాయింట్లు లభిస్తాయి.