Rahul Dravid : భారత దేశం ప్రపంచానికి ఎందరో గొప్ప ఆటగాళ్లను అందించింది. వీళ్లలో రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పేరు చిరస్థాయిగా నిలిచిపోతోంది. ఎందుకంటే.. అతడు లేని భారత క్రికెట్ను ఊహించలేం. అవును.. సుదీర్ఘ ఫార్మాట్లో తన జిడ్డు ఆటతో బౌలర్లకు పరీక్ష పెట్టిన అతడు అలుపెరగని ధీరుడు. బుల్లెట్ లాంటి బంతుల్ని అవలీలగా ఎదుర్కొనే సాహసి అతడు. ఒక ఆటగాడిగా భారత జట్టు చిరస్మరణీయ విజయాల్లో భాగమైన ద్రవిడ్.. ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్గా సేవలందిస్తున్నాడు. ద్రవిడ్ గురువారం 51వ వసంతంలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఈ దిగ్గజ క్రికెటర్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
భారత క్రికెట్లో ద్రవిడ్ స్థానాన్ని మరొకరు పూడ్చలేరు. ఎంతటి కఠినమైన పరిస్థితుల్లోనైనా అతడు ఫెవికాల్ లెక్క క్రీజులో అతుక్కుపోతాడు. బౌలర్ల సహనాన్ని సత్తువను పీల్చిపిప్పి చేస్తాడు. చాప కింద నీరులా పరుగులు దొంగిలిస్తూ మిస్డర్ డిపెండబుల్ ట్యాగ్ సొంతం చేసుకున్నాడు.
సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), సౌరభ్ గంగూలీ(Sourabh Ganguly), అజారుద్దీన్(Azharuddin)లు దూకుడును నమ్ముకొని స్టార్ ఆటగాళ్లుగా పేరుతెచ్చుకుంటే.. ద్రవిడ్ మాత్రం తన సొగసైన ఆట, బలమైన టెక్నిక్తో టెస్టు స్పెషలిస్ట్గా మారాడు.
ఆస్ట్రేలియా గడ్డపై 2008లో తొలి టెస్టు విజయంలో ద్రవిడ్ కీలక పాత్ర పోషించాడు. కంగారూ పేస్ దళాన్ని సమర్దంగా ఎదుర్కొంటూ పెర్త్ టెస్టులో 93 పరుగులతో టీమిండియాను గెలిపించాడు. ఇక భారత్.. దాయాది పాకిస్థాన్పై 2005లో తొలి సిరీస్ గెలవడంలో ద్రవిడ్ రోల్ ఉంది. బౌన్సీ పిచ్లకు కేరాఫ్ అయిన దక్షిణాఫ్రికా గడ్డపై తొలి విజయాన్ని రుచి చూసిన కెప్టెన్ కూడా ద్రవిడే కావడం విశేషం.
He was crucial when India won a Test in Australia for the first time in a generation. He was crucial in India’s first series win in Pakistan. He captained India to their first win in South Africa and first series win in England for 21 years.
When things got tough, The Wall got… pic.twitter.com/QuheykykFT
— ESPNcricinfo (@ESPNcricinfo) January 11, 2024
ఇంగ్లండ్ నేలపై 21 ఏండ్ల తర్వాత టీమిండియా తొలి సిరీస్ విజయం నమోదు చేయడం.. ఇవన్నీ ద్రవిడ్ కెరీర్లో గొప్ప మైలురాళ్లు. 2001లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో వీవీఎస్ లక్ష్మణ్(281)తో కలిసి ద్రవిడ్(180) ఆడిన చారిత్రాత్మక ఇన్నింగ్స్ను భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. వీరిద్దరి వీరోచిత పోరాటంతో ఇండియా 171 పరుగులతో గెలుపొంది సిరీస్ను సొంతం చేసుకుంది.
వీవీఎస్ లక్ష్మణ్(281), ద్రవిడ్(180)
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించిన ద్రవిడ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 1996 జూన్ 20న ఇంగ్లండ్పై అతడు టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లో 7వ స్థానంలో బరిలోకి దిగిన ద్రవిడ్ 267 బంతుల్లో 95 రన్స్ కొట్టి భావితారగా ప్రశసంలు పొందాడు.
టెస్టుల్లో 36, వన్డేల్లో 12 సెంచరీలు బాదిన ఈ స్టార్ ప్లేయర్ అంతర్జాతీయ క్రికెట్లో 24,177 పరుగులు సాధించాడు. తొలుత వన్డేలు, టీ20ల నుంచి వైదొలిగిన ద్రవిడ్ 2012లో తనకెంతో ఇష్టమైన టెస్టు క్రికెటకూ వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ అనంతరం అండర్ 19 జట్టుకు కోచ్గా, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్గా కొనసాగాడు.
రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్గా పగ్గాలు అందుకున్న ద్రవిడ్ అనతికాలంలోనే తనముద్ర వేశాడు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా కనిపించే ద్రవిడ్ జట్టుకు దూకుడుగా, భయం లేకుండా ఆడడం అలవాటు చేశాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్లతో కలిసి జట్టును విజయాల పట్టించాడు.
ద్రవిడ్ బృందం
ఆస్ట్రేలియా గడ్డపై 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు సెమీస్లోనే ఇంటిదారి పట్టింది. దాంతో, ద్రవిడ్ తన వ్యూహాలను మార్చాడు. రొటేషన్ పద్ధతికి శ్రీకారం చుట్టడమే కాకుండా వరుసగా విఫలమవుతున్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్లపై నమ్మకం ఉంచాడు. అతడి నమ్మకాన్ని నిలబెడుతూ అయ్యర్, రాహుల్.. వరల్డ్ కప్లో భారీ స్కోర్లు చేసి జట్టుకు కొండంత అండగా నిలిచారు. పైగా టీ20 వరల్డ్ కప్ ఉన్నందున ద్రవిడ్ బృందం పదవీ కాలాన్ని బీసీసీఐ మరికొన్ని రోజులు పొడిగించిన విషయం తెలిసిందే.