వన్డే ప్రపంచకప్నకు ముందు జట్టు కూర్పును సరిచూసుకునేందుకు పనికి వస్తుందనకున్న ఆసియా కప్లో భారత్కు వరుణుడి బాధ తప్పేలా లేదు. పాకిస్థాన్తో శనివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. నేడు నేపాల్తో మ్యాచ్కు కూడా వరుణుడు అడ్డుపడే అవకాశం ఉంది. గత మ్యాచ్లో విఫలమైన టాపార్డర్ ఈ సారైనా సత్తాచాటుతుందా చూడాలి. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన బుమ్రా ఈ మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయాడు!
Asia Cup 2023 | పల్లెకెలె: మరో నెల రోజుల్లో వన్డే ప్రపంచకప్ సమరం ప్రారంభం కానుండగా.. మెగాటోర్నీపై దృష్టి పెట్టి ఆసియాకప్లో అడుగుపెట్టిన టీమ్ఇండియాకు వరుణుడు కరుణించడం లేదు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో పోరు వర్షం కారణంగా రద్దు కాగా.. సోమవారం నేపాల్తో పల్లెకెలెలోనే జరుగనున్న మ్యాచ్కు కూడా వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ సాధ్యమైతే.. అందరి దృష్టి భారత టాపార్డర్పైనే నిలువనుంది. గత మ్యాచ్లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయినా టాప్-4 ఈ సారి ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. వరల్డ్కప్నకు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లయ అందుకునేందుకు ఈ మ్యాచ్ తోడ్పడుతుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే పాకిస్థాన్ సూపర్-4కు క్వాలిఫై కాగా.. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే భారత్ కూడా ముందంజ వేయనుంది. పాక్తో పోరులో రాణించిన ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అదే ఫామ్ కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తున్నది. మరోవైపు తొలిసారి భారత్తో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న నేపాల్.. ఈ అవకాశం రావడమే గొప్పగా భావిస్తున్నది. మ్యాచ్కు ముందు రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ జట్టు కెప్టెన్ రోహిత్ పడేల్ ఇదే మాట అన్నాడు.
గత మ్యాచ్లో ఫలితం తేలకపోయినా.. మనవాళ్లకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ అయితే లభించింది. నాణ్యమైన పేస్ను ఎదుర్కోవడం ఎంత కష్టమో పాక్తో పోరులో తెలిసొచ్చింది. బౌలర్లకు అవకాశం దక్కకపోయినా.. బ్యాటర్లు తమ లోపాలు పరిశీలించుకోవడానికి చాన్స్ లభించింది. అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజ హోదా అందుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేలవంగా ఔట్ కావడం అభిమానులను సైతం నిరాశ పరచగా.. ఆ తప్పులు సరిదిద్దుకోవాలని వాళ్లు తహతహలాడుతున్నారు. వర్షం కారణంగా ఆదివారం మనవాళ్లు ప్రాక్టీస్కు దూరం కాగా.. కోహ్లీతో పాటు మరికొందరు జిమ్లో కసరత్తులు చేశారు. వ్యక్తిగత కారణాలతో బుమ్రా ఈ మ్యాచ్కు దూరం కాగా.. అతడి స్థానంలో మహమ్మద్ షమీ జట్టులోకి రావడం ఖాయమే. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసే అవకాశం తక్కువే. సాధారణంగా ఓపెనింగ్ చేసే కిషన్ గత మ్యాచ్లో మిడిలార్డర్లోనూ రాణించడం జట్టుకు శుభపరిణామం. మరోవైపు పాకిస్థాన్తో తొలి మ్యాచ్లో 238 పరగుల తేడాతో ఓడిన నేపాల్.. స్టార్లతో నిండి ఉన్న టీమ్ఇండియాకు కనీసం పోటీ ఇస్తే చాలు అని భావిస్తోంది.
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్, ఇషాన్, పాండ్యా, జడేజా, శార్దూల్, కుల్దీప్, షమీ, సిరాజ్.
నేపాల్: రోహిత్ పడెల్ (కెప్టెన్), కుషాల్, ఆసిఫ్, ఆరిఫ్, సోమ్పాల్, దీపేంద్ర సింగ్, గుల్షన్, కుషాల్ మల్ల, కరణ్, సందీప్ లమిచానె, లలిత్.
పల్లెకెలెలో సోమవారం వర్షం కురిసే అవకాశం ఉంది. శనివారం ఇక్కడ జరిగిన పోరు ఆరంభంలో పిచ్ పేసర్లకు సహకరించగా.. మరోసారి అదే పరిస్థితి కొనసాగవచ్చు.