పోచెఫ్స్ట్రూమ్ : ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. తొలుత న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులకు పరిమితమైంది. పార్శవి చోప్రా(3/20) ధాటికి కివీస్ బ్యాటింగ్ కుదేలైంది. జార్జియా ప్లిమ్మర్(35), ఇసాబెల్లా గేజ్(26) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన భారత్ 14.2 ఓవర్లలో 110/2 స్కోరు చేసింది.
ఓపెనర్ శ్వేతా షెరావత్(61 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో అదరగొట్టింది. కివీస్ బౌలింగ్ దాడిని తుత్తునియలు చేస్తూ జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది. 45 బంతుల్లో 10 ఫోర్లతో కదంతొక్కింది. కెప్టెన్ షెఫాలీ వర్మ(10)మరోమారు నిరాశపరిచింది. అన్నా బ్రౌనింగ్(2/18) రెండు వికెట్లు తీసింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో భారత్ తలపడుతుంది.