వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయం నుంచి త్వరగానే తేరుకున్న టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాతో తొలి టీ20లో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా విశాఖ సాగర తీరాన సాగిన పోరులో భారత్ బోణీ కొట్టింది!
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించగా.. వన్డే వరల్డ్కప్ ఫైనల్లో అభిమానులను నిరాశ పరిచిన 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఈసారి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
మొత్తానికి మెగా పరాజయాన్ని మరిచి ముందడుగు వేసిన యంగ్ ఇండియా.. భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నది!
విశాఖపట్నం: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన భారత జట్టు.. ఆ ఓటమి నుంచి త్వరగానే బయటపడింది. సీనియర్ల గైర్హాజరీలో యువ జట్టుతో బరిలోకి దిగిన యంగ్ ఇండియా.. కంగారూలపై కొంతలో కొంత ప్రతీకారం తీర్చుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం విశాఖపట్నంలో జరిగిన మొదటి టీ20లో భారత్ 2 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. భారత జట్టుకు తొలిసారి కెప్టెన్గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. జోస్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్వితీయ సెంచరీతో కదంతొక్కగా.. స్టీవ్ స్మిత్ (41 బంతుల్లో 52; 8 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.
ముఖేశ్ కుమార్ (0/29) పొదుపుగా బౌలింగ్ చేయగా.. తక్కిన వాళ్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టీమ్ఇండియా సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసింది. సమన్వయ లోపంతో రుతురాజ్ గైక్వాడ్ (0) ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే వెనుదిరగగా.. యశస్వి జైస్వాల్ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు. తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (12; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలువలేకపోగా.. ఆఖర్లో తీవ్ర ఒత్తిడిని అధిగమించి రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మిగిలిన పని పూర్తిచేశాడు. ఆసీస్ బౌలర్లలో తన్వీర్ సంఘా రెండు వికెట్లు పడగొట్టగా.. ముగ్గురు భారత బ్యాటర్లు రనౌట్ అయ్యారు. సూర్యకుమార్యాదవ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం తిరువనంతపురంలో రెండో టీ20 జరగనుంది.
ఛేదనలో భారత్కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లోనే రుతురాజ్ వెనుదిరగగా.. కాసేపటికే యశస్వి ఔటయ్యాడు. దీంతో భారత్ 22/2తో కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ చక్కటి పోరాటం కనబర్చారు. ఇటీవల ముగిసిన వరల్డ్కప్లో ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరూ కంగారూలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగారు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడటంతో సాధించాల్సిన రన్రేట్ పెరిగిపోగా.. క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో మొదట ఇషాన్ 37 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. సూర్య 29 బంతుల్లో ఆ మార్క్ చేరుకున్నాడు. వరల్డ్కప్ ఫైనల్లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ చేస్తూ.. తనదైన మార్క్ చూపెట్టలేకపోయిన సూర్యకుమార్.. ఈ సారి ధాటిగా ఆడాడు. మైదానం నలువైపులా షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టాడు. మిస్టర్ 360 దూకుడు చూసిన ప్రతి ఒక్కరూ ‘ఈ ఆట ఫైనల్లో ఆడుంటేనా..!’ అనుకోక మానరు. విజయానికి 15 పరుగులు కావాల్సిన సమయంలో సూర్య ఔటైనా.. రింకూ సింగ్ లాంఛనాన్ని ముగించాడు.
ఆస్ట్రేలియా: 208/3 (ఇంగ్లిస్ 110, స్మిత్ 52; ప్రసిద్ధ్ 1/50, రవి 1/54),
భారత్: 20 ఓవర్లలో 209/8 (సూర్యకుమార్ 80, ఇషాన్ 58; తన్వీర్ 2/47).
2021 నుంచి పొట్టి ఫార్మాట్లో భారత జట్టుకు సారథ్యం వహించిన తొమ్మిదో కెప్టెన్గా సూర్యకుమార్ నిలిచాడు.
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో పరాజయం అనంతరం సరిగ్గా నాలుగు రోజుల తర్వాత టీమ్ఇండియా తిరిగి మైదానంలో అడుగుపెట్టగా.. అభిమానులు బ్రహ్మరథం పట్టారు. వరల్డ్కప్ ఫైనల్లో భారత జట్టు ప్రదర్శన ప్రేక్షకుల మనసులపై ఎలాంటి ప్రభావం చూపలేదని విశాఖ నగరం నిరూపించింది. మ్యాచ్ ఆరంభానికి రెండు గంటల ముందు నుంచే.. ఏసీఏ వీడీసీఏ మైదానానికి పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ఎటు చూసినా నీలి జెర్సీలతో స్టాండ్స్ నిండిపోగా.. మనవాళ్లు మంచి షాట్ ఆడిన ప్రతిసారీ.. మైదానం ఊగిపోయింది. ముఖ్యంగా ఇషాన్, సూర్యకుమార్ భారీ షాట్లతో విరుచుకుపడుతున్న సమయంలో అభిమానులు స్టేడియాన్ని హోరెత్తించారు. దీంతో ఫలితంతో సంబంధం లేకుండా.. టీమ్ఇండియాకు తమ మద్దతు కొనసాగుతుందని అభిమానులు తేల్చి చెప్పినైట్లెంది!
టీ20ల్లో భారత్కు ఇదే (209) అత్యధిక ఛేదన. గతంలో హైదరాబాద్లో చేసిన 208 పరుగుల చేజింగ్ రెండో స్థానానికి చేరింది.