మిడిలార్డర్ బ్యాటర్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ అర్ధశతకాలతో సత్తాచాటడంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఆధిక్యం సాధించింది. స్టార్లు ఎక్కువసేపు నిలువలేకపోయిన చోట వీరిద్దరూ భారీ షాట్లతో విజృంభించడంతో టీమ్ఇండియా మ్యాచ్పై పట్టు సాధించే దిశగా సాగుతున్నది.
మీర్పూర్: బౌలర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడవడంతో బంగ్లాదేశ్తో రెండో టెస్టులో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. ఇప్పటికే తొలి టెస్టు కోల్పోయిన ఆతిథ్య బంగ్లా.. తాజా మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో 227 పరుగులకు ఆలౌట్ కాగా.. ఓవర్నైట్ స్కోరు 19/0తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా 314 పరుగులు చేసింది.
రిషబ్ పంత్ (104 బంతుల్లో 93; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (105 బంతుల్లో 87; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) వన్డే తరహా ఆటతీరుతో ఆకట్టుకున్నారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (10) వైఫల్యాల పరంపర కొనసాగించగా.. శుభ్మన్ గిల్ (20), చతేశ్వర్ పుజారా (24), విరాట్ కోహ్లీ (24) ఎక్కువ సేపు నిలువలేకపోయారు. దీంతో ఒక దశలో 94/4తో కష్టాల్లో కనిపించిన జట్టును.. పంత్, శ్రేయస్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 159 పరుగులు జోడించారు. ఈ జంట జోరుతో భారత్ మరింత భారీ స్కోరు చేయడం ఖాయం అనుకుంటే.. సెంచరీలకు చేరువైన తర్వాత వీరిద్దరూ వెనుదిరిగారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్, తైజుల్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది.