హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టిక్కెట్లపై కొన్ని రోజులుగా సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) వ్యవహరిస్తున్న తీరుపై అభిమానులు గుర్రుగా ఉన్నారు.
మ్యాచ్కు సమయం(ఈనెల 25న) సమీపిస్తున్న వేళ ఆన్లైన్, ఆఫ్లైన్ అంటూ సాగదీసిన హెచ్సీఏ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. గురువారం నుంచి జింఖానా మైదానంలో ఉదయం 10 గంటల నుంచి టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని అధ్యక్షుడు అజారుద్దీన్ పేరిట ఒక ప్రకటన విడుదలైంది. ఓవైపు మ్యాచ్కు సమయం దగ్గర పడుతుండటంతో విసిగిపోయిన అభిమానులు బుధవారం జింఖానా మైదానంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వేలాది మంది యువకులు హెచ్సీఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బ్లాక్ టిక్కెట్లపై ఉక్కుపాదం: మంత్రి శ్రీనివాస్గౌడ్
భారత్, ఆసీస్ టీ20 మ్యాచ్ టిక్కెట్లపై మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పందించారు. టికెట్లను బ్లాక్లో విక్రయిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిలో ఏర్పాటైన హెచ్సీఏ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ అభిమానులకు టిక్కెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.