హైదరాబాద్ : భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరుగనున్నది. నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్ ఉప్పల్ వేదికగా జరుగనున్నది. తొలి రెండు మ్యాచుల్లో.. చెరొకటి గెలుచుకున్న విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండగా.. ఈ స్టేడియంలో ఇది మూడో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం విశేషం. 2019లో వెస్టిండిస్పై ఆరు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. ఈ మ్యాచ్కు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరానున్నారు. ఉప్పల్ స్టేడియంలో 55వేల మంది కూర్చునే సామర్థ్యం ఉన్నది.
ఇదిలా ఉండగా.. మ్యాచ్కు పోలీసులు భారీ బలగాలను మోహరించారు. మైదానం వద్ద 2,500 మంది పోలీసులతో భద్రత కల్పించారు. స్టేడియం చుట్టుపక్కల 15కిలోమీటర్ల మేర నిఘావేశారు. సుమారు 300 సీసీకెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూంతో అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నారు. మ్యాచ్ రాత్రి 7 గంటలకు జరుగనుండగా.. ఇరుజట్లు సాయంత్రం 5 గంటలకు స్టేడియానికి చేరుకోనున్నాయి. సాయంత్రం 4 గంటలకు ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించనున్నారు. మైదానంలోకి మొబైల్ఫోన్ను అనుమతించనున్నట్లు పోలీసులు తెలిపారు. మ్యాచ్కు ముందు మరోసారి స్టేడియంలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టాయి.
క్రికెట్ అభిమాల కోసం మెట్రో, ఆర్టీసీ సర్వీసులను నడుపనున్నది. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రోసేవలు అందుబాటులో అందుబాటులో ఉండనుండగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్టీసీ సర్వీసులను సర్వీసులను ప్రారంభించింది. స్టేడియానికి వచ్చే వారికి 21 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. గేట్ నంబర్ 1 నుంచి ఆటగాళ్లు, కొందరు ప్రముఖులకు మాత్రమే అనుమతి ఉండగా.. గేట్ నంబర్-2 నుంచి హెచ్సీఏ, మీడియా, పోలీసులను అనుమతించనున్నారు.
ప్రస్తుతం స్టేడియం వద్దకు క్రికెట్ అభిమానులు చేరుకుంటున్నారు. మ్యాచ్ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. టికెట్లు ఉన్న వారు మాత్రమే రావాలని పోలీసుల సూచించారు. మరో వైపు మ్యాచ్ ముగిశాక టీఎస్ఐఐసీ నుంచి బయటకు మార్గం ఏర్పాటు చేశారు. మ్యాచ్ అనంతరం ప్రేక్షకులు త్వరగా బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసిన పోలీసులు వివరించారు.