అహ్మదాబాద్: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నెల రోజుల నుంచి అభిమానులను అలరిస్తున్న పొట్టి ప్రపంచకప్లో ఫైనల్ ఫైట్కు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల వ్యవధిలో ఆతిథ్య భారత్, న్యూజిలాండ్ మధ్య తుది పోరు జరుగనుంది. 20 జట్ల సమాహారంతో మొదలైన వరల్డ్కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ముచ్చటగా మూడోసారి కప్ను ముద్దాడేందుకు సూర్యకుమార్యాదవ్ నేతృత్వంలోని టీమ్ఇండియా కల సాకారం చేసుకోవాలని చూస్తుంటే.. సుదీర్ఘ కాలంగా అందని ద్రాక్షగానే మారిన వరల్డ్కప్ టైటిల్ కోసం కివీస్ చకోర పక్షిలా వేచిచూస్తున్నది. ప్రపంచంలోని రెండు మేటి జట్ల మధ్య పోరు కోట్లాది మంది ఫ్యాన్స్ను అలరించడం ఖాయంగా కనిపిస్తుండగా, ఆఖరి పోరాటానికి భారత్, న్యూజిలాండ్ అస్త్రశస్ర్తాలతో సిద్ధమయ్యాయి.
మెగాటోర్నీలో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి మినహాయిస్తే ఎదురుపడ్డ ప్రత్యర్థినల్లా చిత్తుచేసిన టీమ్ఇండియా..ఫైనల్లోనూ కివీస్ భరతం పట్టాలని చూస్తున్నది. పొట్టి ఫార్మాట్లో గత మూడేండ్లుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న భారత్ రికార్డు స్థాయిలో మూడోసారి టైటిల్ ఒడిసిపట్టుకునేందుకు తహతహలాడుతున్నది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇప్పటి వరకు సిరీస్ కోల్పోని టీమ్ఇండియా అదే పంథాను కొనసాగించేందుకు అడుగులు వేస్తున్నది. అయితే కివీస్ రూపంలో బలమైన ప్రత్యర్థి ఉండటం టీమ్ఇండియాకు ఒకింత ప్రతికూలంగా కనిపిస్తున్నది. దీనికి తోడు 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ అభిమానుల కండ్ల ముందు కదలాడుతున్నది. రోహిత్శర్మ కెప్టెన్సీలో అపజయమెరుగని టీమ్ఇండియా టైటిల్ ఆశలపై ఆసీస్ నీళ్లు గుమ్మరించిన క్షణాలు ఫ్యాన్స్ మదిలో మెదులుతూనే ఉన్నాయి. అహ్మదాబాద్లో నాడు ఎదురైన ఓటమికి ఇప్పటికీ బాధపడుతున్న సగటు అభిమానికి పొట్టి ప్రపంచకప్ విజయం ఊరటనిచ్చేలా ఉండాలని ఆశిస్తున్నారు.
మొతెరా స్టేడియంలో వ్యక్తిగత రికార్డుల పరంగా ఢోకా లేకపోయినా జట్టు పరంగా భారత్కు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో పలు సెంటిమెంట్లు.. గతంలో బస చేసిన హోటల్కు బదులు కొత్త దాంట్లో దిగడం, ఎర్ర, నల్లని మట్టితో పిచ్ తయారి లాంటి అంశాలు ఫ్యాన్స్కు ఆసక్తి కల్గిస్తున్నాయి. కానీ అనిశ్చితికి మారుపేరైన టీ20ల్లో ఆవగింజంత అదృష్టం లేకపోతే కలల కప్ దక్కడం కష్టం. ఇదిలా ఉంటే 2000లో నాకౌట్ టోర్నీ మినహాయిస్తే ఇప్పటి వరకు కివీస్ ఖాతాలో వరల్డ్కప్ టైటిల్ లేకపోవడం వారిని కలవరపెడుతున్నది. దశాబ్దాలుగా సెమీస్ టీమ్గా ముద్రపడ్డ కివీస్ దాన్ని చెరిపేసుకుని కొత్త చరిత్ర వైపు అడుగులు వేయాలని చూస్తున్నది. ఇరు జట్ల కూర్పును గమనిస్తే తమదైన రోజున మ్యాచ్ను శాసించే ప్లేయర్లకు కొదువ లేదు.
అభిషేక్, వరుణ్పై నజర్:
మెగాటోర్నీ ముందు వరకు అభిషేక్శర్మ, వరుణ్ చక్రవర్తి సూపర్ ఫామ్లో ఉన్నారు. అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పరుగుల వరద పారిస్తే..మిస్టరీ స్పిన్తో వరుణ్ వికెట్ల వేట కొనసాగించాడు. కానీ మెగాటోర్నీలో వీరిద్దరి ప్రదర్శన ఘోరంగా తయారైంది. టీ20 ఫార్మాట్లో నంబర్వన్ ర్యాంక్లతో అడుగుపెట్టిన అభిషేక్, వరుణ్ అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. హ్యాట్రిక్ డక్లతో అభిషేక్ నిరుత్సాహా పరిస్తే..వరుణ్ మిస్టరీ కోడ్ను డీకోడ్ చేసిన బ్యాటర్లు వీరబాదుడు బాదుతున్నారు. దీంతో కివీస్తో ఫైనల్లో వీరిద్దరు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అభిషేక్ స్థానానికి ఇబ్బంది లేకపోయినా..వరుణ్ బెర్తును కుల్దీప్యాదవ్ లేదా సిరాజ్తో భర్తీ చేసేందుకు మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నది. అంతకుమించి మార్పులేమి ఉండకపోవచ్చు. యార్కర్కింగ్ బుమ్రా మరోమారు సత్తాచాటితే కలల కప్ భారత్ ఖాతాలో చేరినట్లే. మరోవైపు కివీస్ ఒకటి లేదా రెండు మార్పులతో బరిలోకి దిగే చాన్స్ ఉంది.