India vs England : భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్(Test Series)లో రికార్డులు బద్ధలయ్యాయి. టీమిండియా 4-1తో సిరీస్ గెలుచుకోగా.. ‘బజ్ బాల్'(Baz Ball) జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్కు తొలి ఓటమి ఎదురైంది. ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించిన భారత్.. టెస్టుల్లో 178 విజయం నమోదు చేసింది. ఇప్పటివరకూ 579 టెస్టులు ఆడిన టీమిండియా 222 మ్యాచులను డ్రా చేసుకొని.. 178 సార్లు ఓటమిపాలైంది. అంతేకాదు ఇంగ్లండ్పై రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఇన్నింగ్స్ తేడాతో జయభేరీ మోగించింది. దాంతో, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC 2023-25) పట్టికలో అగ్రస్థానం కైవసం చేసుకుంది.
టెస్టు క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించిన ఈ సిరీస్లో ఇరుజట్ల హిట్లర్లు సిక్సర్ల మోత మోగించారు. దాంతో, ఒకే సిరీస్లో 100 సిక్సర్లు నమోదైన తొలి సిరీస్గా భారత్, ఇంగ్లండ్ సిరీస్ రికార్డుల్లోకెక్కింది. ఐదు మ్యాచుల్లో భారత ఆటగాళ్లు 72 సిక్సర్లు బాదగా.. ఇంగ్లండ్ జట్టు వాటా 22 మాత్రమే.
𝙒.𝙄.𝙉.𝙉.𝙀.𝙍.𝙎! 🏆
Congratulations #TeamIndia on winning the @IDFCFIRSTBank #INDvENG Test Series 4⃣-1⃣ 👏👏 pic.twitter.com/IK3TjdapYv
— BCCI (@BCCI) March 9, 2024
రోహిత్ శర్మ, క్రిస్ గేల్
ఇందులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ ఒక్కడే 26 సార్లు బంతిని స్టాండ్స్లోకి పంపడం గమనార్హం. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ 12వ టెస్టు శతకంతో దిగ్గజాలను దాటేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 48వ సెంచరీతో క్రిస్ గేల్ రికార్డును హిట్మ్యాన్ బ్రేక్ చేశాడు. అంతేకాదు డబ్ల్యూటీసీలో 7 సెంచరీలు బాదిన తొలి క్రికెటర్గా రోహిత్ మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ ఐదు టెస్టుల సిరీస్లో భారత స్పిన్ ఆల్రౌండర్ అశ్విన్ వందో మ్యాచ్ ఆడేశాడు. ధర్మశాలలో 100వ టెస్టు క్యాప్ అందుకున్న అతడు చిరస్మరణీయ ప్రదర్శనతో భారత్ను గెలిపించాడు. నూరో టెస్టులో 5 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా ఈ స్పిన్ మాంత్రికుడు రికార్డు నెలకొల్పాడు.
టీమిండియా నుంచి అనిల్ కుంబ్లే తొలిసారి ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా చూస్తే.. మురళీధరన్, దివంగత షేన్ వార్న్, కుంబ్లే తర్వాత వందో టెస్టులో 5 వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్ అశ్వినే.
రాజ్కోట్లో డెబ్యూ క్యాప్ అందుకున్న సర్ఫరాజ్ ఖాన్ సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. రంజీల్లో పరుగుల వరద పారించిన ఈ డాషింగ్ బ్యాటర్ ఇంగ్లండ్ బౌలర్లను చీల్చిచెండాడుతూ రెండు ఇన్నింగ్స్ల్లోనూ హాఫ్ సెంచరీలు బాదేశాడు. తొలి ఇన్నింగ్స్లో 62 బంతుల్లోనే 66.. రెండో ఇన్నింగ్స్లో 78 బంతుల్లోనే 68 నాటౌట్తో అదరహో అనిపించాడు.
దాంతో, అరంగేట్రం మ్యాచ్లో రెండు ఫిఫ్టీలు కొట్టిన నాలుగో భారత క్రికెటర్గా సర్ఫరాజ్ రికార్డుల్లోకెక్కాడు. అతడి కంటే ముందు దిల్వార్ హుస్సేన్, సునీల్ గవాస్కర్, శ్రేయస్ అయ్యర్లు ఈ ఫీట్ సాధించారు.
శ్రీకర్ భరత్ స్థానంలో జట్టులోకి వచ్చిన ధ్రువ్ జురెల్ అరంగేట్రం సిరీస్లోనే రఫ్పాడించాడు. రాంచీ టెస్టులో సంచలన బ్యాటింగ్తో జట్టును ఒంటిచేత్తో గెలిపించిన జురెల్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ అందుకున్నాడు. దాంతో, అజయ్ రత్రా తర్వాత తొలి టెస్టు సిరీస్లోనే ఈ అవార్డు అందుకున్న వికెట్ కీపర్గా జురెల్ రికార్డు నెలకొల్పాడు.
ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఈ సిరీస్లో మరో మైలురాయికి చేరాడు. 41 ఏండ్ల వయసులో భారత గడ్డపై ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన ఈ స్పీడ్స్టర్.. ధర్మశాలలో కుల్దీప్ యాదవ్(30)ను ఔట్ చేసి 700 వికెట్ల క్లబ్లో చేరాడు.
దాంతో, 147 సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలో ఈ ఘతన సాధించిన తొలి పేసర్గా జిమ్మీ రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా అండర్సన్ మరో రికార్డు సృష్టించాడు.టెస్టుల్లో ఎక్కువ వికెట్ల వీరుల జాబితాలో ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో టాప్లో ఉండగా.. ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్(708) వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.