జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు రాణించారు. పేసర్లు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ సత్తాచాటారు. దీంతో జింబాబ్వే టాపార్డర్ విలవిల్లాడింది. ఈ క్రమంలోనే 16 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే నాలుగు వికెట్లు కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో జింబాబ్వే ఓపెనర్ కూటానో (7).. కీపర్ శాంసన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ ఇన్నొసెంట్ కాయా (16) కూడా కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
మధెవెరె (2)ను ప్రసిద్ధ్ అవుట్ చేయగా.. జింబాబ్వే సారధి రెగిస్ చకబ్వా (2)ను శార్దూల్ అవుట్ చేశాడు. దీంతో ఆ జట్టు 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో సికందర్ రజాతో కలిసి షాన్ విలియమ్స్ నిదానంగా ఆడుతూ.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడుతున్నాడు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే 50/4 స్కోరుతో నిలిచింది.