హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే టీమిండియా నయా కెప్టెన్ రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. జోసెఫ్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. అంపైర్ అవుటిచ్చినా.. అనుమానం ఉండటంతో రోహిత్ రివ్యూ తీసుకున్నాడు. కానీ రివ్యూ ఫలితం కూడా రోహిత్కు కలిసిరాలేదు. దీంతో 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ పెవిలియన్ చేరాడు.
ఓపెనర్లు శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అందుబాటులో లేకపోవడంతో.. తన ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడైన ఇషాన్ కిషన్తో కలిసి ఓపెనింగ్ చేసిన రోహిత్ భారత స్కోరుబోర్డును తనదైన స్టైల్లో ముందుకు తీసుకెళ్లాడు. 177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు రోహిత్ శర్మ (60), ఇషాన్ కిషన్ (17 నాటౌట్) మంచి ఆరంభాన్నందించారు. వీరిద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో పదమూడు ఓవర్లకు 84/0 స్కోరుతో భారత జట్టు నిలిచింది.
అయితే ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే రోహిత్ వెనుతిరిగాడు. దీంతో క్రీజులోకి వచ్చిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు వరుస బౌండరీలు బాదాడు. అయితే అదే ఓవర్ ఐదో బంతికి హుక్ షాట్ ఆడేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. దీంతో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతిని లాంగ్లెగ్లో రోచ్ అందుకున్నాడు. దీంతో ఒకే ఓవర్లో భారత జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం భారత స్కోరు 93/2.
Gone Virat Kohli#INDvWI #ViratKholi #RohitSharma pic.twitter.com/TGno89MYR7
— Saqlain Khan (@Saqlainkhan2022) February 6, 2022