శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో బెంగళూరు పిచ్ టీమిండియా పాలిట శాపంలా మారింది. తొలి సెషన్ నుంచే విపరీతంగా టర్న్ లభిస్తుండటంతో లంక స్పిన్నర్లు భారత్ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ (15), విహారి (31), కోహ్లీ (23) స్పిన్నర్ల మాయలో పడిపోయారు.
ముఖ్యంగా కోహ్లీ అయితే షార్ట్ పిచ్ బంతి బౌన్స్ అవకుండా రావడంతో దాన్ని ఊహించలేక ఎల్బీగా వెనుతిరిగాడు. ఆ తర్వాత రిషభ్ పంత్ (39) కూడా టర్న్ను అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన జడేజా (4) ఎక్స్ట్రా బౌన్స్కు బలయ్యాడు.
ఎంబుల్డెనియా వేసిన లెంగ్త్ బాల్ టర్న్, బౌన్స్తో జడేజా మీదకు వచ్చింది. దాన్ని అతను తప్పించుకోవడంలో విఫలం అవడంతో జడ్డూ గ్లవ్ను తాకిన బంతి గాల్లోకి లేచింది. దాన్ని ఫస్ట్ స్లిప్లో ఉన్న తిరిమానే ముందుకు దూకి అందుకున్నాడు. జడేజా కూడా బంతి టర్న్, బౌన్స్ చూసి ఆశ్చర్యపోయాడు. జడ్డూ కూడా పెవిలియన్ చేరడంతో 38 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 150/6 స్కోరుతో నిలిచింది.