తొలి పరీక్షలో రోహిత్ శర్మ అద్భుతమైన మార్కులతో పాసయ్యాడు. టెస్టు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆడుతున్న తొలి టెస్టులో మర్చిపోలేని విజయం అందుకున్నాడు. లంకపై ఏకంగా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో జయభేరి మోగించాడు.
లంకతో తొలి టెస్టులో ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్లు అదరగొట్టారు. వీళ్లు స్పిన్నర్లు అనడం కన్నా ఆల్రౌండర్లు అంటే సముచితంగా ఉంటుంది. ఎందుకంటే జడేజా, అశ్విన్ ఇద్దరూ అటు బ్యాటుతో ఇటు బంతితో ఈ మ్యాచ్ను ఏకపక్షం చేశారు. వీరి ధాటికి శ్రీలంక జట్టు రెండో ఇన్నింగ్సులో 178 పరుగులకు ఆలౌట్ అయిపోయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (175 నాటౌట్), రిషభ్ పంత్ (96), రవిచంద్రన్ అశ్విన్ (61), హనుమ విహరి (58), విరాట్ కోహ్లీ (45) రాణించడంతో 574/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
బ్యాటింగ్కు దిగిన లంకేయులను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో చెలరేగాడు. దీంతో తొలి ఇన్నింగ్సులో లంక జట్టు 174 పరుగులకే ఆలౌట్ అయి ఫాలో ఆన్లో పడింది. ఫాలో ఆన్లో కూడా జడేజా 4, అశ్విన్ 4 వికెట్లతో చెలరేగారు. వీరికి మహమ్మద్ షమీ 2 వికెట్లతో జత కలిశాడు.
భారత బౌలర్లను లంక బ్యాటర్లు ఏమాత్రం ఎదుర్కోలేకపోయారు. నిరోషన్ డిక్కవెల్ల (51 నాటౌట్) మాత్రమే ఫర్వాదలేదనిపించాడు. మిగతా వాల్లంతా 30 పరుగుల లోపు స్కోర్లకే పెవిలియన్ చేరడంతో రెండో ఇన్నింగ్సులో శ్రీలంక 178 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం నమోదు చేసింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.