టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ లేకుండానే ఆడుతున్నాడు. అందుకని అతను ఫామ్లో లేడని అనుకుంటే పొరపాటే. క్రీజులో ఉన్నంతసేపూ పూర్తి ఆధిపత్యంతో ఆడుతున్న అతను.. అదృష్టం కలిసి రాక అవుటైపోతున్నాడు.
మొహాలీలో జరిగిన కోహ్లీ 100వ టెస్టులో కూడా అదే జరిగింది. 76 బంతుల్లో సునాయాసంగా 45 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎంబుల్డెనియా బౌలింగ్లో బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో బెంగళూరులో జరిగే పింక్ బాల్ టెస్టుపై మాజీ ఆటగాడు నిఖిల్ చోప్రా ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
‘‘బెంగళూరులో జరిగే పింక్ బాల్ టెస్టు కోహ్లీ అదృష్టాన్ని మార్చేస్తుందని ఆశిస్తున్నా. మొదటి టెస్టులో అతను ఆడటానికి ఏమీ ఇబ్బంది పడినట్లు ఏమీ లేదు. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇలా కేవలం మొహాలీలోనే కాదు చాలా మ్యాచులుగా కోహ్లీ 40-45 పరుగులు చేస్తూనే ఉన్నాడు. ఒక్కసారి ఈ పరిస్థితి మారి మంచి స్కోరు చేస్తే చాలు అతను మళ్లీ గాడిలో పడతాడు’’ అని నిఖిల్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
అలాగే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కోహ్లీకి కొత్తేమీ కాదని చెప్పాడు. కోహ్లీది ఢిల్లీ అయినా కూడా బెంగళూరులోనే ఎక్కువ మ్యాచులు ఆడాడని, ఐపీఎల్లో కూడా ఆరంభం నుంచి బెంగళూరు జట్టుకే ప్రాతినిధ్యం వహించాడని గుర్తుచేశాడు. అంతేకాదు, పింక్ బాల్ టెస్టులో సెంచరీ చేసిన ఏకైక భారత బ్యాటర్ కూడా కోహ్లీనే.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కోహ్లీ కనుక బెంగళూరులో సెంచరీ సాధిస్తే.. ఆ తర్వాత అతన్ని ఎవరూ ఆపలేరని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. మరి తన హోం గ్రౌండ్ వంటి చిన్నస్వామి స్టేడియంలో అయినా కోహ్లీ మ్యాజిక్ ఫిగర్ అందుకుంటాడేమో చూడాలి.