శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలిరోజు విహారి (58), రిషభ్ పంత్ (96), రెండో రోజు జడేజా (175 నాటౌట్), అశ్విన్ (61) రాణించడంతో భారత జట్టు 574/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన లంకేయులను భారత స్పిన్నర్లు తెగ ఇబ్బంది పెట్టారు. అశ్విన్, జడేజా అద్భుతమైన స్పెల్స్ వేశారు.
వీరిధాటికి లంక ఓపెనర్లు దిముత్ కరుణరత్నే (28), లాహిరు తిరుమానే (17) స్వల్పస్కోర్లకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్లో ఏంజెలో మాథ్యూస్ (22) అవుటవగా.. ధనంజయ డిసిల్వా (1)ను మళ్లీ అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మళ్లీ జడేజా, అశ్విన్ పదునైన బౌలింగ్తో లంకేయులను ముప్పుతిప్పలు పెట్టారు. రెండో రోజు చివరి ఓవర్లలో వరుసగా మెయిడెన్లు ఉన్నాయంటేనే వారు లంక బ్యాటర్లపై ఎంత ఒత్తిడి పెట్టిందీ అర్థం చేసుకోవచ్చు.
దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక జట్టు 108/4 స్కోరుతో నిలిచింది. భారత స్కోరుకు ఇంకా 466 పరుగులు వెనుకపడి ఉంది. మూడో రోజు కూడా భారత బౌలర్లు విజృంభిస్తే.. లంకకు ఫాలో ఆన్ తప్పదు. ప్రస్తుతం శ్రీలంక బ్యాటర్లు చరిత్ ఆశలంక (1 నాటౌట్), పాథుమ్ నిస్సంక (26 నాటౌట్) క్రీజులో ఉన్నారు.