గతేడాది టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడటం భారత్ను దారుణంగా దెబ్బతీసిందని, కానీ రాబోయే ఆసియా కప్లో మాత్రం టీమిండియాదే పైచేయి అని పాకిస్తాన్ మాజీ సారథి రషీద్ లతీఫ్ అన్నాడు. ప్రపంచకప్ ఓటమిని టీమిండియా మనసులో పెట్టుకోదని, కానీ ఆ జట్టు లక్ష్యాలు వేరే ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్-2022లో భాగంగా భారత జట్టు.. ఈనెల 28న పాకిస్తాన్తో తలపడనున్నది.
ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేదానిపై ఇప్పటికే ఇరు దేశాల క్రికెట్ విశ్లేషకులు తమవైన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో లతీఫ్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘గతేడాది ప్రపంచకప్ ఓటమి టీమిండియా మనసులో ఉంటుందని నేను అనుకోవడం లేదు. కానీ ఆ ఓటమి మాత్రం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అయితే ఆ తర్వాత వాళ్లు లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగుతున్నారు..
ఆ తర్వాత జరిగిన ప్రతీ సిరీస్లోనూ వాళ్లు విజయమే లక్ష్యంగా సాగుతున్నారు. దానిని సాధిస్తున్నారు కూడా. అంతేగాక ప్రతీ సిరీస్లోనూ ఆటగాళ్లను మారుస్తున్నారు. ఇక టీమిండియా ప్రస్తుత దృష్టి ఆసియా కప్ మీదే ఉంది. ఈ మేరకు భారత జట్టు, బీసీసీఐలు ఈ మ్యాచ్ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి..
కీలక ఆటగాళ్లు అందరూ అందుబాటులో ఉంటే ఈ టోర్నీలో టీమిండియాను ఆపడం ఎవరితరమూ కాదు. యూఏఈలో పరిస్థితులు కూడా భారత్కు అనుకూలంగా ఉంటాయి. గడిచిన రెండు దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్లలో టీమిండియాదే ఆధిపత్యం.
కానీ గతేడాది టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ను విజయం వరించింది. కావున రాబోయే మ్యాచ్లో భారత జట్టు తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది’ అని లతీఫ్ తెలిపాడు. ఎన్ని మ్యాచ్లున్నా భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు ఉండే మజానే వేరని లతీఫ్ అభిప్రాయపడ్డాడు. గ్రూప్ దశలోనే కాకుండా ఈ టోర్నీలో సూపర్-4లో కూడా భారత్-పాక్లు తలపడే అవకాశముంది.