న్యూజిల్యాండ్, భారత జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా ఆలస్యంగా ఆట ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ (120 నాటౌట్), వృద్ధిమాన్ సాహా (25 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు మయాంక్, శుభ్మన్ గిల్ (44) మంచి ఆరంభం అందించారు. కానీ 80 పరుగుల వద్ద గిల్ అవుటైన తర్వాత భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ 30వ ఓవర్లో పుజారా (0), కోహ్లీ (0) డకౌట్ అయ్యారు. కోహ్లీ అవుట్ వివాదాస్పదం అయినప్పటికీ భారత జట్టుకు మాత్రం ఇది గట్టి షాకిచ్చింది.
ఇలాంటి పరిస్థితుల్లో శ్రేయాస్ అయ్యర్ (18) తోడుగా మయాంక్ మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 160 పరుగుల వద్ద అయ్యర్ అవుటయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన సాహా.. మయాంక్కు అండగా నిలిచాడు. వీళ్లిద్దరూ చాలా సంయమనంతో ఆడారు. ఈ క్రమంలోనే రెండేళ్ల తర్వాత మయాంక్ శతక్కొట్టాడు.
సాహా కూడా చక్కగా బ్యాటింగ్ చేశాడు. చివర్లో లైట్ సరిగా లేకపోవడంతో ఇన్నింగ్స్ను 70 ఓవర్లకే ముగించారు. ఈ సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. భారత్ కోల్పోయిన నాలుగు వికెట్లూ అజాజ్ పటేల్ తీసినవే కావడం గమనార్హం.