ద్వైపాక్షిక సిరీస్ల్లో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న టీమ్ఇండియా.. న్యూజిలాండ్తో వన్డే పోరుకు సమాయత్తమైంది. ఒక వైపు టికెట్ల లొల్లి.. మరోవైపు హెచ్సీఏలో లుకలుకల మధ్య దాదాపు నాలుగేండ్ల తర్వాత ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఇటీవల శ్రీలంకపై వన్డే సిరీస్ క్లీన్స్వీప్ చేసి రోహిత్ సేన జోరు మీదుంటే.. మరోవైపు పాకిస్థాన్పై వన్డే సిరీస్ నెగ్గి న్యూజిలాండ్ సమరోత్సాహంతో కదనానికి సిద్ధమైంది. ఇప్పటికే నగరానికిక్రికెట్ ఫీవర్ పట్టుకోగా.. బ్యాటింగ్, బౌలింగ్కు సమంగా సహకరించనున్న పిచ్పై ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి!
హైదరాబాద్, ఆట ప్రతినిధి: సొంతగడ్డపై ఎదురులేని ఫామ్ కొనసాగిస్తున్న టీమ్ఇండియా మరో సిరీస్కు సిద్ధమైంది. శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్లు నెగ్గి ఫుల్ జోష్లో ఉన్న భారత్.. ఇక న్యూజిలాండ్తో పోరుకు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం భారత్, న్యూజిలాండ్ మధ్య ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్కు సొంతగడ్డపై ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కాగా.. వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయనున్నాడు. లంకపై మూడో వన్డేలో భారీ శతకంతో చెలరేగిన విరాట్ కోహ్లీ.. తనకు అచ్చొచ్చిన ఉప్పల్లో మరోసారి విజృంభించాలని అభిమానులు ఆశిస్తున్నారు. గాయం కారణంగా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిరీస్కు దూరం కాగా.. అతడి స్థానంలో సూర్యకుమార్ తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. మరోవైపు తాజాగా పాకిస్థాన్పై వన్డే సిరీస్ నెగ్గి.. నేరుగా హైదరాబాద్ చేరుకున్న న్యూజిలాండ్ జట్టు.. అదే జోరు కొనసాగిస్తూ భారత్పై కూడా సిరీస్ పట్టేయాలని చూస్తున్నది. బ్యాటింగ్ గ్రేట్ కేన్ విలియమ్సన్తో పాటు టిమ్ సౌథీ అందుబాటులో లేకపోవడం లోపమే అయినా.. యువ ఆటగాళ్లతో నిండిన కివీస్ జట్టును తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే. 2010 తర్వాత భారత జట్టు స్వదేశంలో ఆడిన 25 వన్డే సిరీస్ల్లో 22 చేజిక్కించుకుని శత్రుదుర్భేద్యంగా కనిపిస్తున్నది. లంకతో ఆడిన చివరి మ్యాచ్లో వన్డే క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద విజయంతో విజృంభించిన రోహిత్ సేన.. కివీస్పై అదే ఊపు కొనసాగిస్తుందా చూడాలి.
అదేంటి.. చాన్నాళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పేస్ బౌలర్ సిరాజ్ అరంగేట్రం చేయడం ఏంటి అనుకుంటున్నారా..! 2017 లోనే జాతీయ జట్టు తరఫున తొలి టీ20 ఆడిన సిరాజ్.. ఆ తర్వాత వన్డే, టెస్టు అరంగేట్రాలు కూడా చేశాడు. టీమ్ఇండియా తరఫున ఇప్పటి వరకు 42 మ్యాచ్లు (15 టెస్టులు, 19 వన్డేలు, 8 టీ20లు) ఆడిన సిరాజ్.. బుధవారం తొలిసారి ఉప్పల్లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. దేశవాళీ, రంజీ, ఐపీఎల్ ఇలా హైదరాబాద్లో జరిగిన ఎన్నో మ్యాచ్ల్లో దుమ్మురేపిన ఈ గల్లీబాయ్.. ఇప్పుడు బ్లూ జెర్సీలో తొలిసారి సొంత ఇలాకాలో బరిలోకి దిగనున్నాడు.
ఈ ఏడాది ఆఖర్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం 20 మంది ఆటగాళ్లతో కోర్ టీమ్ను ఎంపిక చేసిన మేనేజ్మెంట్.. యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షిస్తున్నది. తానాడిన చివరి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతాడని మంగళవారం రోహిత్ స్పష్టం చేశాడు. ఓపెనర్ శుభ్మన్ గిల్ మంచి టచ్లో ఉండగా.. ఇషాన్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడని హిట్మ్యాన్ పేర్కొన్నాడు. వన్డే క్రికెట్లో 46వ శతకం పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ.. వంద శతకాల వైపుగా ఉప్పల్లో మరో అడుగు వేసేందుకు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేస్తున్నాడు. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కు రానున్నారు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్కు దూరం కాగా.. స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్కు అవకాశం దక్కనుంది. మహమ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్తో కలిసి హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు మోయనున్నాడు. కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ వంటి సీనియర్ ఆటగాళ్లు లేకున్నా.. ప్రతిభావంతమైన యువ ఆటగాళ్లతో న్యూజిలాండ్ బలంగా కనిపిస్తున్నది. కెప్టెన్ టామ్ లాథమ్తో పాటు ఫిన్ అలెన్, కాన్వే, నికోల్స్, డారిల్ మిషెల్, గ్లెన్ ఫిలిప్స్, మిషెల్ బ్రాస్వెల్, శాంట్నర్తో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీమ్ఇండియా స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్పై కెప్టెన్ రోహిత్శర్మ ప్రశంసలు కురిపించాడు. శ్రీలంకతో ఇటీవలే ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్లో సిరాజ్ దుమ్మురేపాడు. తనదైన స్వింగ్ బౌలింగ్తో లంక బ్యాటర్లను బోల్తా కొట్టిస్తూ వికెట్ల వేట కొనసాగించాడు. తన కెరీర్లో సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడబోతున్న సిరాజ్ ప్రదర్శన హిట్మ్యాన్ మెప్పు పొందింది. బుధవారం రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో తొలి వన్డే సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా భేటీలో రోహిత్..సిరాజ్ ప్రదర్శనతో పాటు పలు అంశాలపై మాట్లాడుతూ ‘సిరాజ్ మాకు చాలా కీలకం. గత రెండేండ్లుగా అతను లైన్ అండ్ లెంగ్త్ విషయంలో మెరుగయ్యాడు. ఈ మధ్య కాలంలో అతన్నుంచి ఔట్స్వింగ్ చూస్తున్నాం. సూపర్ స్వింగ్తో లంకతో మ్యాచ్ల్లో వికెట్లు తీసి చేతల్లో చూపించాడు. కొత్త బంతితో నిలకడగా రాణించడం జట్టుకు మరింత కీలకం కానుంది. ఈ మధ్య కాలంలో బౌలింగ్ గురించి అతడు బాగా ఆలోచిస్తున్నాడని నేను అనుకుంటున్నా. దీనికి తోడు టీమ్ మేనేజ్మెంట్ అతన్నుంచి ఏం కోరుకుంటుందో తెలుసుకున్నాడు. మొత్తానికి జట్టుకు సిరాజ్ రూపంలో మంచి బౌలర్ దొరికాడు. సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్తో పాటు ఆస్ట్రేలియాతో త్వరలో జరిగే టెస్టు సిరీస్ కోసం సిరాజ్ను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది’ అని అన్నాడు.