Cheteshwar Pujara: టీమిండియా నయా వాల్గా గుర్తింపు పొంది దశాబ్దకాలంగా టెస్టులలో భారత్ బ్యాటింగ్ లైనప్కు కీలకంగా మారిన ఛతేశ్వర్ పుజారా రంజీలలో అదరగొడుతున్నాడు. జాతీయ జట్టులో తిరిగి చోటు దక్కించుకోవాలని చూస్తున్న పుజారా.. సెలక్టర్ల దృష్టిలో పడేందుకు కష్టపడుతున్నాడు. దేశవాళీలో అత్యంత కీలకమైన రంజీ ట్రోఫీలో భాగంగా ఈ సీజన్లో ఇప్పటికే ఆడిన ఐదు మ్యాచ్లలో 538 పరుగులు చేసిన పుజారా సగటు 76.86గా ఉంది. ఇదివరకే ఓ డబుల్ సెంచరీ ఉండగా తాజాగా రాజస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో కూడా ఈ సౌరాష్ట్ర బ్యాటర్ సెంచరీ (110)తో రాణించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పుజారాకు ఇది 62వ శతకం కావడం గమనార్హం.
అయ్యర్కు గాయం..!
ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులలో ఆడిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉండేది అనుమానమేనని తెలుస్తోంది. అయ్యర్ స్థానంలో సెలక్టర్లు పుజారాను ఎంపికచేసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ పుజారా దేశవాళీ ఫామ్ను గనక సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటే అది అతడికి కలిసొచ్చేదే.
పుజారాకు ఛాన్స్ దక్కేనా..?
భారత జట్టు ఇదివరకే హైదరాబాద్, విశాఖపట్నం టెస్టులలో విరాట్ కోహ్లీ సేవలను కోల్పోయింది. తొలి టెస్టులో ఆడిన కెఎల్ రాహుల్ గాయం కారణంగా వైజాగ్ టెస్టుకు మిస్ అయ్యాడు. అతడు మూడో టెస్టు ఆడేది లేనిది డౌటే. రోహిత్ శర్మ ఫామ్ కోల్పోయాడు. వన్ డౌన్ లో వస్తున్న శుభ్మన్ గిల్.. వైజాగ్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో మెరిసినా అంతకుముందు మూడు ఇన్నింగ్స్లలో దారుణంగా విఫలమయ్యాడు. మిడిలార్డర్లో భారత బ్యాటింగ్ చాలా వీక్గా ఉందనేది గత రెండు టెస్టులను చూసినవారికి ఎవరికైనా తెలుస్తోంది. బ్యాటింగ్కు అనుకూలించిన వైజాగ్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (209) మినహా మిగిలినవారెవరూ కనీసం 40 పరుగులు చేయడానికి తంటాలు పడ్డారు.
కోహ్లీ, జడేజా, రాహుల్ల గైర్హాజరీలో భారత్.. సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్లను జట్టులోకి తీసుకున్నా పాటిదార్కు మాత్రమే తుది జట్టులో చోటు దక్కింది. భారత జట్టులో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మూడో టెస్టు వరకైనా కోహ్లీ అందుబాటులో ఉంటాడా..? లేదా..? అన్నది అనుమానమే. ఈ నేపథ్యంలో మిడిలార్డర్లో అనుభవం ఉన్న బ్యాటర్ను తీసుకుంటే జట్టుకు ఉపయోగమన్న వాదనలు వినపడుతున్నాయి. మరి ఈ విషయంలో సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.