IND vs ENG 5th Test | ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీలు లేకున్నా రోహిత్ శర్మ సారథ్యంలోని యువ భారత్ సిరీస్ను ఇప్పటికే 3-1తో ఒడిసిపట్టింది. ధర్మశాలలో కూడా గెలుపు మొగ్గు భారత్ వైపునకే ఉంది. కీలక ఆటగాళ్లు లేకున్నా టీమిండియా.. యువ ఆటగాళ్ల అద్బుత ప్రదర్శనలతో ఈ సిరీస్ను దక్కించుకుంది. గతేడాది టెస్టులలో ఎంట్రీ ఇచ్చిన యశస్వీ జైస్వాల్.. ఈ సిరీస్లో ఇప్పటికే 710 పరుగులు చేయగా ఈ సిరీస్ ద్వారానే అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, దేవ్దత్ పడిక్కల్లు అంచనాలకు మించి రాణించారు. ఈ సిరీస్లో భాగంగానే రెండో టెస్టులో ఎంట్రీ ఇచ్చిన రజత్ పాటిదార్ మినహా మిగిలినవాళ్లంతా భారత టెస్టు జట్టు భావితారలుగా కనిపిస్తున్నారు. ఈ సిరీస్లో ఏకంగా ఐదుగురు ప్లేయర్లు (ముగ్గురు బ్యాటర్లు, ఒక వికెట్ కీపర్, ఒక బౌలర్) భారత్ తరఫున కెరీర్లు మొదలుపెట్టడం గమనార్హం.
రజత్ పాటిదార్..
కోహ్లీ గైర్హాజరీతో దేశవాళీతో పాటు భారత్ ‘ఎ’ తరఫున అదరగొడుతున్న రజత్ పాటిదార్ వైజాగ్ టెస్టులో ఛాన్స్ దక్కించుకున్నాడు. తన తొలి టెస్టులో 41 (32, 9) పరుగులు చేసిన పాటిదార్ తర్వాత రెండు టెస్టులలోనూ ఆకట్టుకోలేదు. రాజ్కోట్లో 5, రాంచీలో 17 పరుగులకే నిష్క్రమించాడు. అయితే విఫలమైనా అతడికి ఫ్యూచర్ ఉందని ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ కొనియాడిన విషయం తెలిసిందే.
సర్ఫరాజ్ ఖాన్..
సుమారు మూడేండ్లుగా భారత జట్టులో చోటు కోసం వేచి చూస్తున్న సర్ఫరాజ్ ఖాన్.. ఎట్టకేలకు రాజ్కోట్ వేదికగా జరిగిన టెస్టులో తొలి టెస్టు ఆడాడు. తొలి టెస్టులోనే రెండు అర్థ సెంచరీలు చేసిన ఈ ముంబై బ్యాటర్.. రాంచీలో 14 పరుగులే చేశాడు. కానీ తాజాగా ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్లో మరో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు.
ధ్రువ్ జురెల్..
రిషభ్ పంత్కు కారు ప్రమాదం.. ఇషాన్ కిషన్కు ఇగోతో ఆ స్థానంలో వచ్చిన కోన శ్రీకర్ భరత్.. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులలో నిరూపించుకునే అవకాశం వచ్చినా విఫలమవడంతో టీమ్ మేనేజ్మెంట్ యూపీ కుర్రాడు ధ్రువ్ జురెల్కు ఛాన్స్ ఇచ్చింది. రాజ్కోట్ టెస్టులో సర్ఫరాజ్తో కలిసి అరంగేట్రం చేసిన జురెల్.. పంత్ వచ్చినా అతడిని పక్కనబెట్టి ఇతడినే ఆడించాలి అన్నంతగా ఆకట్టుకుంటున్నాడు. వికెట్ల వెనుక కీపింగ్తో పాటు వికెట్ల ముందు బ్యాటింగ్తోనూ అదరగొడుతున్నాడు. రాజ్కోట్ టెస్టులో భాగంగా ఆడిన తొలి ఇన్నింగ్స్లోనే బెరుకు లేకుండా 46 రన్స్ చేసిన జురెల్.. భారత బ్యాటర్లు విఫలమైన రాంచీ పిచ్పై 90 పరుగులు చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లోనూ 39 పరుగుల చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
Dhruv Jurel told Kuldeep Pope will step out and play.
– On the very next ball, Pope stepped out and got stumped. 🔥pic.twitter.com/7zIgFOkJFx
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 7, 2024
ఆకాశ్ దీప్..
బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో రాంచీ టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్కు అవకాశం దక్కింది. ఆడిన తొలి టెస్టులోనే ఆకాశ్.. రాంచీ టెస్టు తొలి సెషన్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. ఫస్ట్ సెషన్లోనే మూడు కీలక వికెట్లు తీసి రాణించాడు. ధర్మశాలలో అతడిని పక్కనబెట్టినా టీమిండియాకు మరో పేసర్ దొరికినట్టేనన్న ప్రశంసలు అతడికి దక్కాయి.
దేవ్దత్ పడిక్కల్
ధర్మశాల టెస్టులో పాటిదార్ స్థానంలో జట్టులోకి వచ్చాడు కర్నాటక కుర్రాడు దేవ్దత్ పడిక్కల్. ఆడిన తొలి టెస్టులోనే ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కుని 65 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ కూడా ఉంది. ఆడుతున్నది తొలి టెస్టే అయినా ఒత్తిడికి లోనుకాకుండా ఆడిన పడిక్కల్ మిడిలార్డర్లో సర్ఫరాజ్తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
🎥 That Maiden Test Fifty Moment! 🙌
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @devdpd07 | @IDFCFIRSTBank pic.twitter.com/NLSSZ9TjCC
— BCCI (@BCCI) March 8, 2024
ఈ యువ ఆటగాళ్లంతా అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో సీనియర్ ప్లేయర్లు లేకున్నా సిరీస్లో భారత్ అదరగొడుతోంది. కోహ్లీ, రోహిత్, అశ్విన్ వంటి సీనియర్ ప్లేయర్లు కెరీర్ చివర్లో ఉన్న దశలో ఈ కుర్రాళ్లు భవిష్యత్కు హామీ ఇస్తూ రాణిస్తుండటం భారత క్రికెట్కు మేలు చేసేదే. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్తో సిరీస్ స్వదేశంలో జరుగుతుండటం వల్ల వీళ్లకు అసలైన సవాల్ ఇప్పటికీ ఎదురుకాలేదనే చెప్పొచ్చు. విదేశీ గడ్డల పై కూడా ఇదే ఆట ఆడితే వచ్చే పది, పదిహేనేండ్లలో ప్రపంచ క్రికెట్లో భారత్దే ఆధిపత్యం అని విశ్లేషకులు వాదిస్తున్నారు.