టెస్టుల్లో భారత్ తరఫున రోహిత్శర్మ కొట్టిన సిక్స్లు. సెహ్వాగ్(90) టాప్లో ఉండగా, ధోనీ(78), సచిన్(69)ను రోహిత్ అధిగమించాడు.
భారత్ తరఫున టెస్టుల్లో మూడు వేలకు పైగా పరుగులు, రెండు వందల వికెట్లు తీసిన మూడో క్రికెటర్గా జడేజా (3003 పరుగులు, 280 వికెట్లు) నిలిచాడు. అశ్విన్ (3271 పరుగులు, 499 వికెట్లు), కపిల్దేవ్ (5248 పరుగులు, 434 వికెట్లు)
ఇంగ్లండ్తో రాజ్కోట్ టెస్టులో భారత బ్యాటర్లు శతక జోరు కనబరిచారు. ఐదు టెస్టుల సిరీస్లో మూడో పోరు కీలకమైన నేపథ్యంలో తమ సత్తాఏంటో చూపెట్టారు. 33 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ రోహిత్శర్మ, జడేజా సూపర్ సెంచరీలతో ఒడ్డున పడేశారు. ఇంగ్లండ్ బౌలింగ్ దాడిని కాచుకు కూర్చుంటూ భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్, జడేజా సమయోచిత ఇన్నింగ్స్తో కోలుకున్న టీమ్ఇండియా..అరంగేట్రం క్రికెటర్ సర్ఫరాజ్ఖాన్ దూకుడైన బ్యాటింగ్తో మూడొందల మార్క్ అందుకుంది. ఆడుతున్నది తొలి టెస్టు అయినా ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా ఆడిన సర్ఫరాజ్ ఇన్నింగ్స్కు ఇరుసుగా నిలువగా, సొంత ఇలాఖాలో జడేజా మరోమారు సెంచరీతో బ్యాట్ను తల్వార్లా తిప్పుతూ విన్యాసాలు చేశాడు.
రాజ్కోట్: ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కీలకమైన మూడో పోరు రాజ్కోట్లో గురువారం మొదలైంది. తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని బ్యాటర్లు నిలబెట్టలేకపోయారు. మార్క్ వుడ్ ధాటికి స్కోరు బోర్డుపై 30 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో రోహిత్శర్మ(196 బంతుల్లో 131, 14ఫోర్లు, 3 సిక్స్లు), జడేజా(212 బంతుల్లో 110 నాటౌట్, 9ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. సర్ఫరాజ్ఖాన్(62) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. సెంచరీ హీరో జడేజా, నైట్వాచ్మన్ కుల్దీప్యాదవ్(1) క్రీజులో ఉన్నారు. మార్క్ వుడ్(3/69) మూడు వికెట్లతో ఆకట్టుకోగా, టామ్ హార్ట్లీ(1/81) వికెట్ పడగొట్టాడు.
రోహిత్, జడేజా విజృంభణ: టాస్ గెలిచిన భారత్కు శుభారంభం దక్కలేదు. పిచ్పై తేమను సద్వినియోగం చేసుకుంటూ ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్..టీమ్ఇండియా టాపార్డర్ను దెబ్బతీశారు. వుడ్ ధాటికి ఓపెనర్ జైస్వాల్(10), శుభ్మన్ గిల్(0) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. వుడ్ వేసిన ఆఫ్సైడ్ హాఫ్స్టంప్ బంతిని ఆడబోయిన జైస్వాల్..స్లిప్లో రూట్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత గిల్ పరుగుల ఖాతా తెరువకుండానే కీపర్ ఫోక్స్కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకొచ్చిన రజత్ పాటిదార్(5) మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. టామ్ హార్ట్లీ బంతిని సరిగా ఆడలేకపోయిన పాటిదార్..కవర్స్లో డకెట్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 33 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ తరుణంలో రోహిత్శర్మ, జడేజాతో కలిసి ఇన్నింగ్స్ను పునర్నిర్మించాడు. ఓ వైపు ఇంగ్లండ్ బౌలర్లు పరీక్ష పెడుతున్నా.. తన అనుభవాన్ని ఉపయోగిస్తూ రోహిత్ అడపాదడపా బౌండరీలతో స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. మరో వికెట్ పడితే ఇన్నింగ్స్ కుప్పకూలుతుందనుకున్న తరుణంలో వీరిద్దరు సమయోచిత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత రోహిత్ పూర్వపు ఫామ్లోకి వచ్చాడు. ఓవైపు చెత్త బంతులను తనదైన శైలిలో శిక్షించిన హిట్మ్యాన్..జడేజాకు చక్కని తోడ్పాటు అందించాడు. లంచ్ విరామం తర్వాత తన కెరీర్లో 11వ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. తానేం తక్కువ కాదన్నట్లు జడేజా కూడా బ్యాటు ఝులిపించడంతో స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతకలిశాయి. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో వుడ్ బౌలింగ్లో స్టోక్స్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. దీంతో నాలుగో వికెట్కు 204 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇంగ్లండ్పై ఇది మూడో అత్యుత్తమ పార్ట్నర్షిప్గా నమోదైంది. రోహిత్ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ఖాన్ అద్భుతమైన పరిణతి కనబరిచాడు. తొలి టెస్టు అయినా దూకుడు కనబరుస్తూ స్వీప్, లాఫ్ట్టెడ్ షాట్లతో పరుగులు కొల్లగొట్టాడు. ఈ క్రమంలో 48 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. అయితే జడేజా సమన్వయలోపంతో సర్ఫారాజ్ రనౌట్గా వెనుదిరిగాడు. కుల్దీప్యాదవ్తో కలిసి సెంచరీ మార్క్ అందుకున్న జడేజా బ్యాట్ను తల్వార్లా తిప్పుతూ తనదైన శైలిలో అభివాదం చేశాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 326/5(రోహిత్ 131, జడేజా 110 నాటౌట్, వుడ్ 3/69, హార్ట్లీ 1/81)