IND vs ENG: స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా హైదరాబాద్లో ముగిసిన తొలి టెస్టులో విఫలమైన భారత్.. ఫిబ్రవరి 02 నుంచి విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు ఆడాల్సి ఉంది. ఈ టెస్టుకు ముందు రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్లు గాయాలపాలవడంతో భారత్కు భారీ షాకులు తాకిన విషయం తెలిసిందే. అంతకుముందే తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరమయ్యాడు. కీలక ఆటగాళ్లు మిస్ అవడంతో భారత జట్టులో అనుభవజ్ఞుల లోటు కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది. రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా వంటి సీనియర్ ప్లేయర్లు శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్ వంటి యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నా వీళ్లందరి పరుగులు ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్ కంటే తక్కువ పరుగులే చేశారు.
టెస్టులలో జో రూట్ తన సుదీర్ఘ కెరీర్లో 136 మ్యాచ్లలో 11,447 పరుగులు చేశాడు. రెండో టెస్టులో కోహ్లీ, కెఎల్, జడేజా వంటి సీనియర్లు మిస్ అయిన నేపథ్యంలో ఎంపిక చేయబోయే ఆటగాళ్లందరి పరుగులు కలిపినా రూట్ చేసినన్ని పరుగులు కావు. తుది జట్టును ఇంకా ప్రకటించకపోయినప్పటికీ ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఆటగాళ్లందరి స్కోర్లు కలిపి 10,702 పరుగులు.
Joe Root has more Test runs than India’s entire squad for the second Test 🤯 #INDvENG pic.twitter.com/u5BCrp4M0S
— ESPNcricinfo (@ESPNcricinfo) January 30, 2024
టెస్టులలో రోహిత్ శర్మ (51 టెస్టులు) 3,801 రన్స్ చేయగా అశ్విన్ (96 టెస్టులు) 3,129 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ కాక మిగిలినవారిలో శుభ్మన్ గిల్ ఒక్కడే వెయ్యి (1,063) పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ (755), యశస్వి జైస్వాల్ (411), అక్షర్ పటేల్ (574) వాషింగ్టన్ సుందర్ (265), జస్ప్రిత్ బుమ్రా (33 టెస్టులు.. 219), కెఎస్ భరత్ (198), మహ్మద్ సిరాజ్ (101) లు అంతా చేసిన పరుగులు 10,702 పరుగులు. రెండో టెస్టుకు సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్లలో ఎవరో ఒకరికి చోటు దక్కొచ్చని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరిలో ఇంతవరకూ భారత్ తరఫున ఒక్క టెస్టు కూడా ఆడలేదు.