2011 తర్వాత కోహ్లీ, పుజార, రహానే లేకుండా భారత్ టెస్టు ఆడటం ఇదే తొలిసారి.
టెస్టుల్లో ఐదు వందల వికెట్ల మైలురాయిని అందుకోవడానికి అశ్విన్కు కావాల్సిన వికెట్లు
భారత్, ఇంగ్లండ్ టెస్టు పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా గురువారం నుంచి ఇరు జట్లు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడబోతున్నాయి. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో హైదరాబాద్ తొలి పోరుకు ఆతిథ్యమిస్తున్నది. ఐదేండ్ల తర్వాత నగరంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇంగ్లండ్ తమ బజ్బాల్ వ్యూహాన్ని నమ్ముకుంటే భారత్ స్పిన్బాల్ సవాల్కు సై అంటున్నది. స్వదేశంలో కొట్టిన పిండిలాంటి పిచ్లపై ఇంగ్లండ్ బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించేందుకు రోహిత్సేన తహతహలాడుతుంటే..బజ్బాల్తో దీటుగా స్పందించేందుకు ఇంగ్లిష్ సైన్యం సమాయత్తమవుతున్నది. మొత్తంగా రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు అభిమానులకు పసందైన విందు అందించడం ఖాయంగా కనిపిస్తున్నది.
Ind Vs Eng Test | హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్వదేశంలో భారత్ టెస్టుల్లో అప్రతిహత విజయాలతో దూసుకెళుతున్నది. గత పుష్కర కాలంగా ప్రత్యర్థికి సిరీస్ కోల్పోని టీమ్ఇండియా..అదే పంథాను కొనసాగించేందుకు పట్టుదలతో ఉంది. ఉప్పల్ స్టేడియం వేదికగా గురువారం నుంచి ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్కు తెరలేవనుంది. దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ సమంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమ్ఇండియా అదే ఊపులో ఇంగ్లండ్ భరతం పట్టాలని చూస్తున్నది. బజ్బాల్కు దీటుగా స్పిన్ వ్యూహాన్ని రచించేందుకు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్శర్మ పక్కా ప్రణాళికతో ఉన్నారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో భారత్, ఇంగ్లండ్ గెలుపు కోసం కడదాకా ప్రయత్నించే అవకాశముంది. బలబలాల పరంగా రెండు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నా..సొంతగడ్డపై ఆడటం భారత్కు అదనపు బలం కానుంది.
సరిగ్గా 12 ఏండ్ల క్రితం ఇదే ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైన భారత్..మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఇన్నేండ్లలో ఆడిన 44 టెస్టుల్లో కేవలం మూడంటే మూడు మ్యాచ్ల్లోనే టీమ్ఇండియా ఓడింది. అంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు భారత్ ఆధిపత్యం ఎలా కొనసాగిస్తుందో. ముఖ్యంగా సంప్రదాయ స్పిన్ను నమ్ముకున్న టీమ్ఇండియా అనుకున్న ఫలితాన్ని సాధిస్తున్నది. ఇందులో స్పిన్ ద్వయం అశ్విన్, జడేజాది కీలక భూమిక. స్వదేశంలో ఎక్కడా మ్యాచ్ జరిగినా..వీరిద్దరు తమ స్పిన్ తంత్రంతో ప్రత్యర్థిని పడగొట్టడంలో సిద్ధహస్తులు. 2012 నుంచి ఇప్పటి వరకు అశ్విన్ 19 సగటుతో 46 టెస్టుల్లో ఏకంగా 283 వికెట్లు నేలకూల్చాడు. మరోవైపు తానేం తక్కువ కాదన్నట్లు జడేజా 39 టెస్టుల్లో 191 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరికి కుల్దీప్యాదవ్, అక్షర్ పటేల్లో ఒకరు జతకలిస్తే..ప్రత్యర్థి తోక ముడువడం ఖాయం. మొదటి రోజు నుంచే స్పిన్ తిరిగే అవకాశం కనిపిస్తున్న ఉప్పల్ పిచ్పై భారత స్పిన్ త్రయం ఇంగ్లండ్ బ్యాటర్లకు మూకుతాడు వేయడం ఖాయంగా కనిపిస్తున్నది. కోహ్లీ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రాహుల్, శ్రేయాస్ అయ్యర్ సత్తాచాటేందుకు తహతహలాడుతున్నారు. బుమ్రా, సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
సంప్రదాయ టెస్టు క్రికెట్కు బజ్బాల్ కొత్త రూపురేఖలు తీసుకొచ్చింది. అప్పటి వరకు నింపాదిగా సాగిన టెస్టు క్రికెట్ను టాప్గేర్లోకి తీసుకెళ్లింది. ఇంగ్లండ్ చీఫ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అమ్ములపొదిలో నుంచి వచ్చిన బజ్బాల్ టెస్టు క్రికెట్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. తొలుత బ్యా టింగ్ చేస్తే..వన్డే, టీ20 తరహాలో దూకుడుగా బ్యాటింగ్ చేయడం ఆ వెంటనే మారు ఆలోచించకుండా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం. బౌలింగ్ చేస్తే..ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకు కట్టడి చేయడం బజ్బాల్ లక్ష్యం. అయితే విదేశాల్లో బజ్బాల్ పాచిక పారినా..భారత్లో అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. గతానికి భిన్నంగా ఇంగ్లండ్ ఈసారి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నది. ఒక రకంగా స్పిన్ను స్పిన్తోనే కొట్టాలనే లక్ష్యంతో ఇంగ్లండ్ కనిపిస్తున్నది. దీంతో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశముంది.
భారత్: రోహిత్(కెప్టెన్), జైస్వాల్, గిల్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్, జడేజా, భరత్, అక్షర్పటేల్, అశ్విన్, బుమ్రా, సిరాజ్
ఇంగ్లండ్: స్టోక్స్(కెప్టెన్), క్రాలె, డకెట్, పోప్, రూట్, బెయిర్స్టో, ఫోక్స్, రేహాన్ అహ్మద్, మార్క్ వుడ్, హార్ట్లె, లీచ్.