మూడేండ్ల తర్వాత హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతుండటంతో తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసేందుకు వేలాదిగా తరలి వచ్చిన అభిమానులకు పరుగుల పండుగ కనువిందు చేసింది. టాస్ పూర్తై ప్రేక్షకులు సీట్లలో కూర్చోక ముందే.. ఆసీస్ ఓపెనర్ కామెరున్ గ్రీన్ సిక్సర్ల వర్షం కురిపిస్తే.. ఆ తర్వాత టిమ్ డేవిడ్ అదే జోరు కొనసాగించాడు. మధ్యలో అక్షర్ పటేల్ సత్తాచాటడంతో ఆసీస్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితం కాగా.. అనంతరం లక్ష్యఛేదనలో సూర్యకుమార్ యాదవ్,విరాట్ కోహ్లీ మెరుపులు మెరిపించడంతో టీమ్ఇండియా సిరీస్ చేజిక్కించుకుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: అచ్చొచ్చిన మైదానంలో టీమ్ఇండియా సిరీస్ కైవసం చేసుకుంది. పరుగుల మోత మోగిన ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో రోహిత్ సేనదే పైచేయి అయింది. టాస్ నెగ్గడంతోనే భారత్ సగం మ్యాచ్ గెలిచేయగా.. మిగిలిన పని ప్లేయర్లు పూర్తి చేశారు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఓపెనర్ కామెరున్ గ్రీన్ (21 బంతుల్లో 52; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (27 బంతుల్లో 54; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు. కెప్టెన్ ఫించ్ (7), స్టీవ్ స్మిత్ (9), మ్యాక్స్వెల్ (6), వేడ్ (1) విఫలమయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్, చాహల్, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. పాయింట్లో సులువైన క్యాచ్ వదిలేసిన అక్షర్ పటేల్.. విద్వంసక ఆటగాడు మ్యాక్స్వెల్ను బౌండ్రీ నుంచి డెరెక్ట్త్రోతో రనౌట్ చేయడం విశేషం. ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో వికెట్ లేకుండా 50 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచి కొట్టగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (48 బంతుల్లో 63; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఉప్పల్లో తన హవా కొనసాగించాడు. ఆఖర్లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆసీస్ బౌలర్లలో సమ్స్ రెండు హజిల్వుడ్, కమిన్స్ చెరో వికెట్ పడగొట్టారు. సూర్యకుమార్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, అక్షర్ పటేల్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి.
కోహ్లీకి కలిసొచ్చిన చోట..
ఉప్పల్లో జరిగిన గత టీ20 మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచిన రన్మెషీన్ విరాట్ కోహ్లీ.. ఆదివారం పోరులోనూ అదే జోరు కొనసాగించాడు. ఓ మాదిరి లక్ష్యఛేదనలో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (17) తక్కువ పరుగులకే పరిమితం కాగా.. రెండో ఓవర్లోనే క్రీజులో అడుగుపెట్టిన కోహ్లీ.. జట్టును విజయానికి చేరువ చేసి వెనుదిరిగాడు. జంపా బౌలింగ్లో బౌండ్రీతో ఖాతా తెరిచిన మాజీ కెప్టెన్.. ఆ తర్వాత నెమ్మదిగా ఇన్నింగ్స్ను నిర్మించాడు. హజిల్వుడ్ వేసిన ఆరో ఓవర్లో 6,4 బాదడంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 50/2తో నిలిచింది. జంపాను లక్ష్యంగా చేసుకొని కోహ్లీ బౌండ్రీలు రాబడుతుంటే.. విరాట్ అండతో మరో ఎండ్లో సూర్యకుమార్ రెచ్చిపోయాడు. భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చూస్తుండగానే అర్ధశతకానికి చేరువైన సూర్య జంపా ఓవర్లో రెండు సిక్సర్లతో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్కు 104 పరుగులు జోడించాక.. మరో సిక్సర్ కొట్టే క్రమంలో సూర్యకుమార్ లాంగాన్లో ఉన్న ఫించ్ చేతికి చిక్కగా.. కమిన్స్ ఓవర్లో సిక్సర్ సాయంతో కోహ్లీ ఫిఫ్టీ మార్క్ దాటాడు. అయితే ఆఖర్లో విరాట్తో పాటు హార్దిక్ పాండ్యా భారీ షాట్లు కొట్టేందుకు ఇబ్బంది పడటంతో ఆసీస్ తిరిగి పట్టు సాధించాలని ప్రయత్నించింది. టీమ్ఇండియా విజయానికి 3 ఓవర్లలో 32 పరుగులు అవసరమైన దశలో హర్దిక్ 4, 6.. కోహ్లీ సిక్సర్ బాదడంతో రోహిత్ సేన సిరీస్ కైవసం చేసుకుంది.
ఆటగాళ్లకు అభినందనలు: సీఎం కేసీఆర్
అద్వితీయ ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియాకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో రోహిత్ సేన 6 వికెట్లతో విజయం సాధించగా.. హైదరాబాద్ వేదికగా భారత జట్టు సిరీస్ కైవసం చేసుకోవడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. చివరి ఓవర్ వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఉత్కంఠభరితంగా సాగిన పోరులో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ.. క్రీడాభిమానులకు పరుగుల విందు అందించిన ఇరు జట్ల క్రీడాకారులను సీఎం అభినందించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా మ్యాచ్ను సమర్థవంతంగా నిర్వహించిన క్రీడాశాఖ మంత్రి, పోలీస్ అధికారులు, స్టేడియం సిబ్బందిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
స్కోరు బోర్డు
ఆస్ట్రేలియా: గ్రీన్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 52, ఫించ్ (సి) పాండ్యా (బి) అక్షర్ 7, స్మిత్ (స్టంప్డ్) కార్తీక్ (బి) చాహల్ 9, మ్యాక్స్వెల్ (రనౌట్/అక్షర్) 6, ఇంగ్లిస్ (సి) రోహిత్ (బి) అక్షర్ 24, డావిడ్ (సి) రోహిత్ (బి) హర్షల్ 54, వేడ్ (సి అండ్ బి) అక్షర్ 1, సమ్స్ (నాటౌట్) 28, కమిన్స్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 186/7. వికెట్ల పతనం: 1-44, 2-62, 3-75, 4-84, 5-115, 6-117, 7-185, బౌలింగ్: భువనేశ్వర్ 3-0-39-1, అక్షర్ 4-0-33-3, బుమ్రా 4-0-50-0, పాండ్యా 3-0-23-0, చాహల్ 4-0-22-1, హర్షల్ 2-0-18-1.
భారత్: రాహుల్ (సి) వేడ్ (బి) సమ్స్ 1, రోహిత్ (సి) సమ్స్ (బి) కమిన్స్ 17, కోహ్లీ (సి) ఫించ్ (బి) సమ్స్ 63, సూర్యకుమార్ (సి) ఫించ్ (బి) గ్రీన్ 69, పాండ్యా (నాటౌట్) 25, కార్తీక్ (నాటౌట్) 1, ఎక్స్ట్రాలు: 11, మొత్తం: 19.5 ఓవర్లలో 187/4. వికెట్ల పతనం: 1-5, 2-30, 3-134, 4-182, బౌలింగ్: సమ్స్ 3.5-0-33-2, హజిల్వుడ్ 4-0-40-1, జంపా 4-0-44-0, కమిన్స్ 4-0-40-1, గ్రీన్ 3-0-14-0, మ్యాక్స్వెల్ 1-0-11-0.