మలుపులు తిరుగుతూ సాగుతున్న ఆఖరి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. గిల్, పుజారా, విహారి, కోహ్లీ, శ్రేయస్ పెవిలియన్కు వరుస కట్టడంతో వందలోపే ఐదు ప్రధాన వికెట్లు కోల్పోయిన భారత్ను పంత్ ఒంటిచేత్తో గట్టెక్కించాడు. టీ20 తరహా ఆటతీరుతో ఇంగ్లిష్ బౌలర్లపై విరుచుకుపడిన రిషబ్.. భారీ సెంచరీతో కదం తొక్కాడు. అతడికి జడేజా చక్కటి సహకారం అందిచాడు. క్రీజులో నిలదొక్కుకుంటే పరుగులు చేయడం పెద్ద కష్టం కాని పిచ్పై టాపార్డర్ విఫలం కాగా.. పంత్, జడ్డూ పరుగుల పండుగ చేసుకున్నారు. ఆట ఆఖర్లో పంత్ వికెట్ పడగొట్టిన ఇంగ్లిష్ జట్టు తిరిగి పోటీలోకి వచ్చింది.
బర్మింగ్హామ్: టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్ సత్తాచాటడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి (రీ షెడ్యూల్) టెస్టులో టీమ్ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్.. శుక్రవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది, వర్షం అంతరాయం మధ్య సాగిన పోరులో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (111 బంతుల్లో 146; 19 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ సెంచరీతో కదం తొక్కగా.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (163 బంతుల్లో 83 బ్యాటింగ్; 10 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. శుభ్మన్ గిల్ (17), చతేశ్వర్ పుజారా (13), హనుమ విహారి (20), విరాట్ కోహ్లీ (11), శ్రేయస్ అయ్యర్ (15) విఫలమవడంతో ఒక దశలో టీమ్ఇండియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత పంత్, జడేజా జోడీ.. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో మెరుగైన స్కోరు చేయగలిగింది. వన్డే తరహా ఆటతో అదరగొట్టిన ఈ జంట ఆరో వికెట్కు రికార్డు స్థాయిలో 222 పరుగులు జోడించింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 3, పాట్ 2 వికెట్లు పడగొట్టారు.
ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు గతేడాది ఇంగ్లండ్లో అడుగుపెట్టిన భారత్.. నాలుగు టెస్టులు ముగిసేసరికి 2-1తో నిలిచిన సమయంలో కరోనా కలకలం రేగడంతో ఆఖరి మ్యాచ్ ఆడకుండానే పర్యటన ముగించుకుంది. మిగిలిపోయిన చివరి టెస్టును నేటి నుంచి కొనసాగించగా.. మొదట బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. స్పెషలిస్ట్ ఓపెనర్లు అందుబాటులో లేకపోవడంతో గిల్తో కలిసి పుజారా ఇన్నింగ్స్ ఆరంభించగా.. ఏడో ఓవర్లో అండర్సన్ ఆఫ్ కట్టర్కు గిల్ స్లిప్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాసేపటికి పుజారా అండర్సన్కు చిక్కగా.. వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. రెండో సెషన్లో విహారి, కోహ్లీ, శ్రేయస్ పెవిలియన్కు క్యూ కట్టారు. విహారి వికెట్ల ముందు దొరికిపోగా.. ఆఫ్స్టంప్కు దూరంగా పోతున్న బంతిని వదిలేసే క్రమంలో ఆలస్యంగా స్పందించిన కోహ్లీ.. బ్యాట్ను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయగా.. ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో టీమ్ఇండియా వందలోపే ఐదు వికెట్లు కోల్పోయింది.
ఇంకేముంది కాసేపట్లో భారత్ ఆలౌటవడం ఖాయం అనుకుంటున్న దశలో.. పంత్, జడేజా విశ్వరూపం కనబర్చారు. టెస్టు ఇన్నింగ్స్ల్లో బెస్ట్ అనదగ్గ ఆటతో పంత్ విజృంభిస్తే.. అతడికి జడ్డూ అండగా నిలిచాడు. కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్న పంత్.. లీచ్ ఓవర్లో 4,4,6తో బ్యాట్కు పనిచెప్పాడు. 51 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్న పంత్.. ఆ తర్వాత మరింతగా చెలరేగిపోయాడు. పాట్స్ బౌలింగ్లో రెండు సార్లు రెండేసి ఫోర్లు అరుసుకున్న రిషబ్.. చూస్తుండగానే శతకానికి చేరువయ్యాడు. మూడో సెషన్లో ఓవర్కు ఆరు పరుగుల చొప్పున రాబట్టిన ఈ జోడీ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచింది. లీచ్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన పంత్.. బ్రాడ్ బౌలింగ్లో డబుల్తో 89 బంతుల్లో టెస్టు క్రికెట్లో ఐదో సెంచరీ తన పేరిట రాసుకున్నాడు. కాసేపటికే జడేజా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత మరింత స్వేచ్చగా ఆడిన పంత్.. లీచ్ ఓవర్లో 4,6,4,6తో చెలరేగిపోయాడు. ప్రధాన బౌలర్లంతా అలిసిపోవడంతో కెప్టెన్ స్టోక్స్ బంతిని రూట్కు అందించగా.. అతడికి పంత్ రెండు ఫోర్లతో స్వాగతం పలికాడు. కాసేపటికే రూట్ తలమీదుగా భారీ సిక్సర్తో అలరించిన పంత్.. తదుపరి బంతికి స్లిప్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శార్దూల్ (1) ఎక్కువసేపు నిలువలేకపోగా.. షమీ(0 బ్యాటింగ్)తో కలిసి మరో వికెట్ పడకుండా జడేజా తొలి రోజు ఆట ముగించాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 338/7 (పంత్ 146, జడేజా 83*; అండర్సన్ 3/52, పాట్స్ 2/85).