టీమిండియా తరఫున 30 ఏండ్ల వయసు దాటాక మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ఆటగాడిగా సూర్యకుమార్ రికార్డుల్లోకెక్కాడు.
ఆర్నెళ్ల తర్వాత మైదానంలో అడుగుపెట్టిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. తనకే సొంతమైన ఫ్లయిటెడ్ డెలివరీలతో ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపాడు. ఫలితంగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో కంగారూలు రెండొందలకు లోపే ఆలౌట్ కాగా.. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్తో భారత్ మంచి స్థితిలో నిలిచింది!
స్పిన్ను ఎదుర్కొనేందుకు సరైన రీతిలో సన్నద్ధమయ్యామని మ్యాచ్కు ముందు బీరాలు పోయిన ఆసీస్ టాపార్డర్.. జడ్డూ జాదూలో కొట్టుకుపోయింది. బౌలర్లు తమ పని సమర్థవంతంగా పూర్తి చేయగా.. ఇక బ్యాటర్లపైనే భారం ఉంది. కుదురుకుంటే పరుగులు చేయడం పెద్ద కష్టం కాని నాగ్పూర్ పిచ్పై రెండో రోజంతా టీమ్ఇండియా బ్యాటింగ్ చేయగలిగితే నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో రోహిత్ సేన బోణీ కొట్టినట్లే!
నాగ్పూర్: బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమ్ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా గురువారం ఇక్కడ ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 177 పరుగులకు ఆలౌటైంది. మార్నస్ లబుషేన్ (49) టాప్ స్కోరర్ కాగా.. స్టీవ్ స్మిత్ (37), అలెక్స్ కారీ (36), పీటర్ హ్యాండ్స్కోంబ్ (31) పర్వాలేదనిపించారు. ఈ నలుగురు మినహా తక్కినవాళ్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా పాంచ్ పటాకా మోగించగా.. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కేఎల్ రాహుల్ (20) వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (69 బంతుల్లో 56 బ్యాటింగ్; 9 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. చేతిలో 9 వికెట్లు ఉన్న టీమ్ఇండియా ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 100 పరుగుల దూరంలో ఉంది. రోహిత్తో పాటు నైట్ వాచ్మన్ అశ్విన్ (0) క్రీజులో ఉన్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే ఉస్మాన్ ఖవాజా (1) వికెట్ల ముందు దొరికిపోగా.. మరుసటి ఓవర్లో షమీ బంతికి డేవిడ్ వార్నర్ (1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. షమీ వేగానికి వికెట్ గాల్లో గింగిరాలు కొట్టిన సీన్ చూసి తీరాల్సిందే. ఈ దశలో లబుషేన్, స్మిత్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా.. లంచ్ తరువాత జడేజా వరుస బంతుల్లో లబుషేన్, రెన్ షా (0)ను ఔట్ చేశాడు. కాసేపటికి జడ్డూ ఓ సూపర్ డెలివరీతో స్మిత్ను బౌల్డ్ చేశాడు. చివర్లో అశ్విన్ అతడికి జత కలవడంతో ఆసీస్ పతనం వేగవంతమైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆరంభంలో ఆచితూచి ఆడింది. ఒక ఎండ్లో కొత్త పెళ్లి కొడుకు కేఎల్ రాహుల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుంటే.. మరో ఎండ్ నుంచి రోహిత్ వన్డే తరహాలో దంచికొట్టాడు. ఫలితంగా తొలి రోజు భారత్ మంచి స్థితిలో నిలిచింది.
చాన్నాళ్లుగా బెంచ్కే పరిమితమవుతున్న ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్ భరత్ ఈ మ్యాచ్తో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. 2019లో తొలిసారి భారత జట్టుకు ఎంపికైన ఈ వికెట్ కీపర్ తొలి మ్యాచ్లో లబుషేన్ను స్టంపౌట్ చేసి ఆకట్టుకున్నాడు. మరోవైపు పొట్టి ఫార్మాట్లో దంచికొడుతూ.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్తోనే టెస్టు అరంగేట్రం చేశాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు సూర్యకుమార్కు మాజీ కోచ్ రవిశాస్త్రి, భరత్కు పుజారా టెస్టు క్యాప్లు అందించారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 177 ఆలౌట్ (లబుషేన్ 49, స్మిత్ 37; జడేజా 5/47, అశ్విన్ 3/42), భారత్ తొలి ఇన్నింగ్స్: 77/1 (రోహిత్ 56 బ్యాటింగ్, రాహుల్ 20; టాడ్ మార్ఫే 1/13)