అన్ని ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీ.. మళ్లీ బ్యాటర్గా రాణించాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా భారత మాజీ ఆటగాడు రీతేందర్ సింగ్ సోధి ఇదే విషయంపై మాట్లాడాడు.
‘కొన్నిరోజుల క్రితం వరకూ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో భారత్కు నాయకత్వం వహించాడు. ఇప్పుడు ఏ ఫార్మాట్లోనూ కెప్టెన్ కాదు. ఈ కొన్ని నెలల్లో చాలా జరిగింది. కానీ కోహ్లీ ఇవన్నీ పట్టించుకోకుండా తన బ్యాటింగ్పైనే దృష్టి పెట్టాలి’ అని సోధి సూచించాడు.
భారత్కు కొన్ని ముఖ్యమైన సిరీస్లు ముందున్నాయని, ప్రపంచకప్లు కూడా ఉన్నాయని ఈ మాజీ ఆటగాడు గుర్తుచేశాడు. ఈ క్రమంలో కోహ్లీ మళ్లీ తన సూపర్ ఫామ్లోకి రావాలని కోరుకున్నాడు. ‘ఒక ఛాంపియన్ ప్లేయర్ ఎప్పుడూ తనతోనే పోటీ పడతాడు. రికార్డుల వెంట పరుగులు తీయడు. ఇప్పుడు గనుక కోహ్లీ తన రికార్డులనే బద్దలు చేయాలని అనుకుంటే.. ప్రత్యర్థులు ఏమవుతారో ఒక్కసారి ఊహించుకోండి’ అని సోధి అన్నాడు.
వచ్చే నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే భారత్-వెస్టిండీస్ సిరీస్లో కోహ్లీ మళ్లీ ఆడతాడు. ఇంతకుముందు సఫారీలతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో కోహ్లీ రాణించినప్పటికీ.. అతను తన గొప్పతనంలో బందీ అయ్యాడని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వచ్చే సిరీసుల్లో కోహ్లీ ఎలా రాణిస్తాడో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.