ఇంగ్లండ్లోని విఖ్యాత లార్డ్స్ స్టేడియం మరో రెండు కీలక మ్యాచ్లకు వేదిక కానున్నది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ (డబ్ల్యూటీసీ) లో భాగంగా నిర్వహించనున్న 2023, 2025 ఫైనల్స్కు లార్డ్స్ వేదిక కానున్నది. ఈ మేరకు బర్మింగ్హోమ్లో మంగళవారంలో ముగిసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వాస్తవానికి 2021లో ఇండియా-న్యూజిలాండ్ మధ్య ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్స్ లార్డ్స్లోనే జరగాల్సింది. అయితే కరోనా కారణంగా చివరి నిమిషంలో వేదికను లార్డ్స్ నుంచి సౌతాంప్టన్కు మార్చారు. కానీ తర్వాత రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్ మాత్రం లార్డ్స్ వేదికగానే జరగునుండటం గమనార్హం.
ఈ ఏడాది జూన్లో ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే బీబీసీతో ముచ్చటిస్తూ.. ‘బహుశా తర్వాతి రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్ లార్డ్స్లోనే జరగొచ్చు’ అని హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐసీసీ దానినే కన్ఫర్మ్ చేసింది. ఇక ఈ సమావేశంలో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహిళల ప్రపంచకప్, ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) వంటివాటిపై చర్చించింది.
ఈ క్రమంలో ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీలో టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుతం ఎన్సీఏ చీఫ్గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్తో పాటు న్యూజిలాండ్ ఆల్రౌండర్ డానియెల్ వెటోరిని క్రికెటర్ల ప్రతినిధులుగా నియమించింది.