నరాలు తెగే ఉత్కంఠ సన్నివేశాలకు.. రోమాలు నిక్క బొడుచుకునే ఉద్వేగ భరిత దృశ్యాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే దాయాదుల సమరానికి సమయం ఆసన్నమైంది.
యావత్ క్రీడా జగత్తును మునివేళ్లపై నిలబెట్టగల మెగా మ్యాచ్లో గెలిచినోడు రాకింగ్.. ఓడినోడు బ్యాకింగ్! ఆడినోడు హీరో.. ఆడనోడు జీరో!
గల్లి పోరగాండ్ల నుంచి.. ఢిల్లీ పౌరుల దాకా! రోజు కూలీల నుంచి.. రాష్ట్రపతి దాక!! ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచకప్లో ఎదురుపడ్డ ఏడుసార్లు పాకిస్థాన్ను చిత్తుచేసిన ఘన చరిత్ర టీమ్ఇండియాదైతే.. దాన్ని తిరగరాయడమే పనిగా పెట్టుకొని బాబర్ సేన పావులు కదుపుతున్నది. మరింకెందుకు ఆలస్యం లక్షా 32 వేల మంది రణన్నినాదాల మధ్య.. 22 గజాల పిచ్పై 22 మంది తలపడే మహా యుద్ధానికి మీరూ సిద్ధమైపోండి!
IND Vs PAK | అహ్మదాబాద్: ప్రపంచకప్లో అత్యంత ప్రతిష్ఠాత్మక మ్యాచ్కు వేళైంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రికెట్ స్టేడియంలో శనివారం పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. ఇప్పటి వరకు వరల్డ్కప్లో ఇరు జట్ల మధ్య ఏడు మ్యాచ్లు జరగగా.. ఆ ఏడింట్లోనూ టీమ్ఇండియానే విజయం వరించింది. ఈ సారి కూడా అదే ఫలితం రాబట్టాలని రోహిత్ సేన తహతహలాడుతుంటే.. గతాన్ని మర్చిపోయి నయా చరిత్ర లిఖిస్తామని పాక్ సారథి బాబర్ ఆజమ్ అంటున్నాడు. మరి ఒత్తిడిలో ప్రపంచ యుద్ధాన్ని తలపించే ఈ సంగ్రామంలో విజేతలు ఎవరో తేలాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. గతంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే చాలు.. పాక్ బౌలింగ్కు, టీమ్ఇండియా బ్యాటింగ్కు మధ్య పోరుగా అభివర్ణించేవాళ్లు. కానీ కాలం మారింది.
భారత్ జట్టులో కూడా మెరుగైన పేసర్లు అందుబాటులోకి రాగా.. బ్యాటింగ్లో పాకిస్థాన్ ఎంతో మెరుగైంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న బాబర్ ఆజమ్తో పాటు ఇమామ్, అబ్దుల్లా, రిజ్వాన్, షకీల్, ఇఫ్తిఖార్, షాదాబ్తో పాక్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నది. మెగాటోర్నీలో రెండు జట్లు ఆడిన రెండు మ్యాచ్లు నెగ్గి మంచి జోష్ మీద ఉండగా.. భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ డెంగ్యూ నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నట్లే అని రోహిత్ వెల్లడించాడు.
మరి కీలకమైన పోరులో అతడికి అవకాశం ఇస్తారా లేక ఇషాన్నే కొనసాగిస్తారా చూడాలి. పాకిస్థాన్పై ఘనమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లీతో పాటు రోహిత్, శ్రేయస్, రాహుల్, పాండ్యా సమిష్టిగా సత్తాచాటాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటున్నది. పాక్ ప్రధాన పేసర్ షాహీన్ షా అఫ్రిది నుంచి టాపార్డర్కు ప్రధాన ముప్పు పొంచి ఉంది. కాస్త నిలదొక్కుకుంటే అతడి బౌలింగ్లో పరుగులు రాబట్టడం పెద్ద కష్టం కాకపోయినా.. ముఖ్యంగా తొలి స్పెల్ను ఎదుర్కోవడంపైనే అందరి దృష్టి నిలువనుంది.
7- వన్డే ప్రపంచకప్లో ఇప్పటి వరకు భారత్, పాక్ మధ్య ఏడు మ్యాచ్లు జరగగా.. ఏడింటా టీమ్ఇండియానే గెలిచింది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్/ఇషాన్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, అశ్విన్/షమీ, బుమ్రా, కుల్దీప్, సిరాజ్.
పాకిస్థాన్: బాబర్ (కెప్టెన్), అబ్దుల్లా, ఇమామ్, రిజ్వాన్, షకీల్, ఇఫ్తిఖార్, షాదాబ్, నవాజ్, షాహీన్, హసన్ , రవుఫ్.
పిచ్, వాతావరణం
అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్కు సహకరించే చాన్స్ ఉంది. ఇక్కడ జరిగిన తొలి పోరులో ఇంగ్లండ్పై న్యూజిలాండ్ దంచికొట్టింది. వాతావరణం వేడీగా ఉండనుంది. టాస్ గెలిచిన జట్టు ఛేదనకు మొగ్గుచూపొచ్చు. మ్యాచ్కు వర్ష సూచనలేదు.
ఐపీఎల్లో ఐదు ట్రోఫీలు అందుకున్న రోహిత్శర్మ.. నువ్వు వన్డే వరల్డ్కప్ ముద్దాడితే చూడాలన్నది మా కల!
క్రికెట్ యవనికపై లెక్కకు మిక్కిలి రికార్డులు ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. సహచరులు నిన్ను భూజానెత్తుకోవడం వీక్షించాలన్నది మా ఆశ!
అటు బంతితో ఇటు బ్యాట్తో దుమ్మురేపగల పాండ్యా.. నువ్వు కపిల్దేవ్, యువరాజ్ను మైమరిపించాలనేది మా అభిమతం!
మిడిలార్డర్కు పిల్లర్ లాంటి అయ్యర్..నువ్వు జట్టు భారం మోయాలనేది మా కోరిక! లోకేశా నువ్వు వికెట్ల వెనుక ధోనీని తలపించాలనేది మా తృష్ణ!
దేశం తీర్చిదిద్దిన అత్యుత్తమ పేసర్లలో అగ్రగణ్యుడివైన బుమ్రా..
నీ దమ్మేంటో ప్రపంచానికి చాటే సమయం ఆసన్నమైంది!
లోకల్ ట్రైన్లో ప్రయాణించేటంతటి సింపుల్ మ్యాన్ శార్దూల్..నువ్వు అటు బంతితో ఇటు బ్యాట్తో మాయ చేయి!
గల్లీ క్రికెట్ నుంచి వచ్చిన సిరాజ్.. నువ్వు మరెందరో బస్తీ పొరగాళ్లకు మార్గదర్శిగా నిలవాలన్నది మా ఆశ!
క్రికెట్ ఇంజనీర్ అశ్విన్ నీ అపార అనుభవాన్ని మైదానంలో వినియోగించు.. రాక్స్టార్ జడ్డూ.. నువ్వు ప్రత్యర్థులను రఫ్ఫాడిస్తూ.. బ్యాట్ సాముతో రెచ్చిపో!!
పన్నేండేండ్ల తర్వాత స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో భారత జట్టు విశ్వ విజేతగా అవతరించాలని కలలు కంటున్న ప్రతి ఒక్క అభిమాని మనసులో మాట ఇది. ఆస్ట్రేలియాను చిత్తు చేసి మెగాటోర్నీలో ఆది విఘ్నాన్ని అలవోకగా దాటేసిన టీమ్ఇండియా.. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పని పెట్టేందుకు సిద్ధమైంది! వరల్డ్కప్ ఫైనల్ కంటే ఎక్కువ ఒత్తిడితో కూడుకున్న ఈ పోరులో పైచేయి సాధిస్తే.. ఇక సెమీస్ దారిలో టీమ్ఇండియాను అడ్డుకునేంత దమ్మున్న జట్టు మరొకటి లేదనేది వాస్తవం! మరి 140 కోట్ల మంది ప్రార్థనలు వెంట పెట్టుకొని అహ్మదాబాద్లో అడుగుపెట్టిన రోహిత్ సేన.. అష్ట దిగ్బంధనంతో పాక్ను ఎనిమిదోసారి పాతరేయాలని ఆకాంక్షిద్దాం!
-ఓ అభిమాని మనోగతం!