పార్ల్ : మహిళల టి20 ప్రపంచకప్లో ఆదివారం పాకిస్థాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసి 6 వికెట్లకు 116 పరుగులు చేసింది. స్వల్ప స్కోరును ఛేదించే క్రమంలో పాకిస్థాన్ ఒత్తిడికి లోనై 5 వికెట్లకు 113 పరుగులే చేసి ఓటమిపాలైంది. చివరి ఓవర్లో విజయంకోసం 18 పరుగులు అవసరం కాగా అలియా రియాజ్ పాకిస్థాన్ను గెలిపించినంత పనిచేసింది. తొలి, 3, 4 బంతులను బౌండరీలకు తరలించి పాక్కు ఆశలు కల్పించింది. అయితే అయిదో బంతికి అలియా అవుటవడంతో వెస్టిండీస్ ఊపిరిపీల్చుకుంది. చివరి బంతికి ఒకే పరుగు రావడంతో విండీస్ మూడు పరుగులతో గెలిచింది. టాపార్డర్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయకపోయినా డబుల్ ఫిగర్ సాధించడంతో విండీస్ స్కోరు వంద పరుగులు దాటగలిగింది. ఓపెనర్ రషద విలియమ్స్(30)దే అత్యధిక స్కోరు. పాక్ బౌలర్లలో నిడా దర్ 2 వికెట్లు దక్కించుకుంది. అనంతరం పాకిస్థాన్ ఓపెనర్లు తక్కువ స్కోర్లకే వెనుతిరిగినా కెప్టెన్ బిస్మా మరూఫ్(26), నిడా దర్(27) మూడో వికెట్కు 44 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. అలియా రియాజ్(29) చివరి వరకు పోరాడినా విండీస్ పట్టుదల ముందు పాక్ ఓడిపోక తప్పలేదు.