ICC: వన్డే వరల్డ్ కప్లో వరుస ఓటములతో పాటు క్రికెట్ బోర్డు సభ్యులందరినీ తొలగిస్తూ ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరవుతున్న శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)కు మరో భారీ షాక్. ఐసీసీ ఫుల్ మెంబర్షిప్ హోదా కలిగిన ఆ జట్టు సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సంచలన ప్రకటన చేసింది. శ్రీలంక క్రికెట్ స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతుందని, బోర్డులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ.. తమ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో ఆడిన తొమ్మిది మ్యాచ్లలో లంకేయులు రెండు మాత్రమే గెలిచారు. మరీ ముఖ్యంగా భారత్పై 50 పరుగులకే ఆలౌట్ అవడంతో ఆ దేశ క్రీడామంత్రిత్వ శాఖ మొత్తం బోర్డు సభ్యులపై వేటు వేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు జోక్యంతో ఈ ప్రక్రియకు కాస్త బ్రేక్ పడింది. అయితే కోర్టు నుంచి లంక బోర్డుకు ఉద్వాసన లభించినా ఐసీసీ మాత్రం ఉపేక్షించలేదు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన బోర్డులో ప్రభుత్వ జోక్యం సరికాదని ఐసీసీ తెలిపింది. లంక బోర్డు స్వయం ప్రతిపత్తిని కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. లంక సభ్యత్వ సస్పెన్షన్కు సంబంధించిన షరతులు నిర్ణీత సమయంలో నిర్ణయిస్తామని ఐసీసీ పేర్కొంది.
అండర్ – 19 వరల్డ్ కప్ నిర్వహణపై నీలినీడలు..
ఐసీసీ సంచలన నిర్ణయంతో అందరి దృష్టి అండర్ -19 ప్రపంచకప్ పైనే పడింది. వచ్చే ఏడాది జనవరి – ఫిబ్రవరిలో శ్రీలంక.. పురుషుల అండర్ – 19 వరల్డ్ కప్కు ఆతిథ్యమివ్వాల్సి ఉంది. లంక బోర్డు సభ్యత్వం రద్దు నేపథ్యంలో మరి ఈ టోర్నీ జరుగుతుందా..? లేదా..? అన్నదీ అనుమానంగా మారింది. ఇదేవిషయమై చర్చించడానికి ఐసీసీ బోర్డు సభ్యులు ఈనెల 21న మరోసారి సమావేశం కానున్నారు. ఆ తర్వాత దీనిపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.