ICC Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ను ఎలాగైనా ఆడించాలని పట్టుదలతో ఉన్న పాకిస్తాన్కు ఒక్కొక్కటిగా భ్రమలన్నీ తొలిగిపోతున్నాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దు, ఇతర సమస్యలతో దాయాదులు గడిచిన పుష్కరకాలంగా ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం లేదు. పాకిస్తాన్కు వెళ్లి అక్కడ ఆడే ప్రశ్నే లేదని బీసీసీఐ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. గతేడాది ముగిసిన ఆసియా కప్లోనూ భారత క్రికెట్ జట్టును తమ దేశానికి రప్పించడానికి చివరివరకూ యత్నించినా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి నిరాశే ఎదురైంది. కానీ 2025లో జరుగబోయేది ఐసీసీ టోర్నీ కావున భారత్ తప్పకుండా వస్తుందని ఆశించినా అక్కడా నిరాశ తప్పడం లేదు. తాజాగా ఐసీసీ చేసిన ప్రకటనతో ఇక మెన్ ఇన్ బ్లూ.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాక్కు వెళ్లడం కష్టమే అని తేలిపోయింది.
దుబాయ్లో శుక్రవారం ముగిసిన ఐసీసీ బోర్డు మీటింగ్ తర్వాత ఐసీసీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ… ‘బోర్డులో ఉన్న సభ్య దేశానికి చెందిన సభ్యుడు మీటింగ్లో తమ సమస్యను విన్నవించుకోవచ్చు. కానీ వాళ్ల (బీసీసీఐ) ప్రభుత్వం అక్కడ ఆడేందుకు అనుమతి లేదని చెప్పిన నేపథ్యంలో ఐసీసీ దీనికి ప్రత్యామ్నాయాన్ని చూడాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప సభ్య దేశం యొక్క సొంత ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా వెళ్లమని చెప్పే అధికారం ఐసీసీకి లేదు..’ అని చెప్పాడు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తిస్థాయిలో పాకిస్తాన్లో నిర్వహించడం కష్టమే అని తేలిపోయింది. భారత్ ఆడే మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించే అవకాశాలున్నట్టు సమాచారం. 2023 ఆసియా కప్లోనూ సగం టోర్నీ పాకిస్తాన్లో జరుగగా మిగిలిన సగం శ్రీలంకలో నిర్వహించారు. గ్రూప్ స్టేజ్లో పలు మ్యాచ్లు మాత్రమే పాక్లో ముగిశాయి. సూపర్ 6తో పాటు ఫైనల్స్కు లంక్ ఆతిథ్యమిచ్చింది.