ICC | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో భాగంగా.. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అభిమానులు చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ఫిర్యాదును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొట్టి పారేసింది. గత శనివారం (అక్టోబర్ 14న) అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ జరగ్గా.. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో దుమ్మురేపిన టీమ్ఇండియా.. విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే.
అయితే ఈ మ్యాచ్ సందర్భంగా మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్ను వీక్షించిన లక్షమందికిపైగా అభిమానులు భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. దీంతో పాటు కొందరు అభిమానులు పాక్ ఫీల్డర్లను లక్ష్యంగా చేసుకొని పరుష పదజాలంతో కామెంట్స్ చేశారు. పాక్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానంలోకి దిగే సమయంలో, తిరిగి లోపలికి వెళ్తున్న క్రమంలో పక్కనే ఉన్న అభిమానులు పాక్ ప్లేయర్లను గేలి చేసే విధంగా కామెంట్స్ చేశారు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఫిర్యాదు చేసింది.
కాగా.. తాజాగా దీనిపై ఐసీసీ స్పందించింది. సమూహంగా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. క్రీడా నిబంధనలను కేవలం వ్యక్తులకే వర్తిస్తాయని.. మొత్తం సమూహానికి కాదని పేర్కొంది. దీంతో పాకిస్థాన్ బోర్డుకు చుక్కెదురైనౖట్లెంది. ఇక అంతకుముందు భారత్తో పోరులో పాకిస్థాన్ జట్టు సరైన ప్రదర్శన చేయకపోవడానికి మైదానంలో ‘దిల్ దిల్ పాకిస్థాన్’ అనే పాట వినబడకపోవడం కూడా ఒక కారణమే అని ఆ జట్టు డైరెక్టర్ ఆర్థర్ చెప్పిన విషయం తెలిసిందే. కాగా.. దీనిపై ఆ దేశానికే చెందిన మాజీ ప్లేయర్లు కూడా అసహనం వ్యక్తం చేశారు. బరిలోకి దిగి ఆడటం చేతకాక.. ఇలా ఓటమికి సాకులు వెతికే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.