ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు(Team India) అనూహ్య ఓటమితో యావత్ భారతావని కన్నీటిసంద్రమైంది. కీలక పోరులో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వ్యూహాలు ఫలించకపోవడంతో పాటు పిచ్ కూడా సహకరించలేదు. దాంతో, ఇలాంటి పిచ్ తయారుచేస్తారా? అంటూ అహ్మదాబాద్ స్టేడియం పిచ్ క్యూరేటర్(Curatro)పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
తాజాగా ఐసీసీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. నవంబర్ 19న నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత్ తలపడిన పిచ్ సాధారణంగా ఉందని ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. ఆశ్చర్యంగా ఔట్ ఫీల్డ్ మాత్రం చాలా బాగుందంటూ ఐసీసీ పేర్కొంది. అంతేకాదు రెండో సెమీఫైనల్కు వేదికైన ఈడెన్ గార్డెన్స్ పిచ్ కూడా సాధారణంగానే ఉందని తెలిపింది.
సొంత గడ్డపై 12 ఏండ్ల తర్వాత జరిగిన వరల్డ్ కప్లో టీమిండియా ఫేవరేట్గా బరిలోకి దిగింది. లీగ్ దశలో ఓటమన్నదే ఎరుగని భారత్.. సెమీస్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి ఫైనల్కు దూసుకెళ్లింది. దాంతో, కప్పు మనదే అని కోట్లాదిమంది అభిమానులు అనుకున్నారు. కానీ, మరోపోరులో.. దక్షిణాఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్ పోరుకు సిద్ధమైంది.
ట్రావిస్ హెడ్
దాంతో, కంగారూలతో కష్టమే అని ప్రతి ఒక్కరి మనసులో ఏదో అనుమానం. అనుకున్నట్టుగానే ఫైనల్లో ఆసీస్ జోరు ముందు టీమిండియా నిలువలేకపోయింది. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని పేస్ దళం విజృంభించడంతో భారత్.. 240 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(137) శతకంతో చెలరేగాడు. దాంతో, ఆస్ట్రేలియా ఆరోసారి వన్డే వరల్డ్ కప్ను ఎగరేసుకుపోయింది.