Loan Write Off | కార్పొరేట్ సర్కార్ అనే పేరును మోదీ ప్రభుత్వం సార్థకం చేసుకున్నది. ఆర్థిక నేరస్థులకు అండగా నిలవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నది. బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఎగ్గొట్టే వారికి బీజేపీ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. ఏకంగా రూ.10.6 లక్షల కోట్ల లోన్లను రైటాఫ్ చేసి కార్పొరేట్ల పట్ల తన అవ్యాజ్యమైన అభిమానాన్ని చాటుకున్నది.
గడిచిన ఐదేండ్లలో కార్పొరేట్లకు సంబంధించిన రూ.10.6 లక్షల కోట్ల రుణాలు నిరర్థక ఆస్తులుగా మారిపోయాయి. వీటిలో సగానికిపైగా దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థలు ఎగ్గొట్టినవే కావడం శోచనీయం. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీలు) ఈ మొత్తాలను నిరర్థక ఆస్తులుగా గుర్తించినట్టు స్వయాన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ లోక్సభ సాక్షిగా సెలవివ్వడం గమనార్హం.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2.09 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్ జాబితాలోకి చేరిపోయాయి. రూ.5 కోట్ల కంటే ఎక్కువ రుణాలు కలిగిన 2,300 మంది రుణగ్రహీతలు కేంద్రం చర్యల వల్ల లబ్ధి పొందారు. ఇందులో 52.3 శాతం రుణాలు పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలవే. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ మొత్తం భారీగా పెరిగింది. గతేడాది రూ.1.75 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్ అయ్యాయి. ఇందులో 39.8 శాతం పెద్ద కార్పొరేట్ సంస్థలకు సంబంధించినవి. ఆర్బీఐ డాటా ప్రకారం 2012 నుంచి రూ.15.31 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్ అయ్యాయి. అయితే నిరర్థక ఆస్తులుగా ప్రకటించిన రుణాల్లో ఎక్కువ మొత్తాలను బ్యాంకులు తిరిగి రాబట్టుకోలేకపోతున్నాయి. రుణాలను రైటాఫ్ చేయడంలో చూపిస్తున్న ఉత్సాహంలో ఒక్క శాతమైనా వాటిని రికవరీ చేయడంలో చూపించకపోవడం శోచనీయం. మొండి బకాయిల రికవరీ డాటాను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతున్నది.
మరోవైపు ఈ రైటాఫ్ వల్ల రుణ ఎగవేతదారులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని కేంద్ర సహాయ మంత్రి చెప్పడం విడ్డూరం. రుణ ఎగవేతదారుల నుంచి రుణాల రికవరీ కొనసాగుతుందని ఆయన చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక్కసారి కార్పొరేట్ రుణాలు నిరర్థక ఆస్తులుగా మారిన తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. రుణ ఎగవేతదారుల నుంచి మన దేశంలో ఇప్పటివరకు ఎంత మొత్తం తిరిగి రాబట్టారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత మూడేండ్లలో రూ.5.87 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేయగా.. వాటిలో రూ.1.09 లక్షల కోట్లను తిరిగి రాబట్టినట్టు ఆర్బీఐ డాటా ప్రకారం తెలుస్తున్నది. ఇది 18.60 శాతం మాత్రమే.
ఇప్పటికే విజయ్మాల్యా, నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ తదితర కార్పొరేట్లు బ్యాంకులను ముంచిన విషయం తెలిసిందే. భారీగా రుణాలు తీసుకొని దివాలా తీసిన వైనం మనందరం చూస్తునే ఉన్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైటాఫ్ చేసిన రుణాలు కూడా ఈ కోవలోకే వస్తాయి.
సామాన్యులు, రైతులు కాళ్లరిగేలా తిరిగినా రుణాలు ఇవ్వని బ్యాంకులు కార్పొరేట్లకు రెడ్కార్పెట్ పరిచి మరీ పెద్ద మొత్తంలో రుణాలను అంటగడుతున్నాయి. రుణాల రికవరీలోనూ ఈ తరహా సూత్రాన్నే బ్యాంకులు పాటిస్తున్నాయి. సామాన్యుల నుంచి రుణాలను ముక్కుపిండి మరీ వసూలు చేసే బ్యాంకులు కార్పొరేట్ల రుణాలను మాత్రం ఎప్పటికప్పుడు రైటాఫ్ చేస్తున్నాయి. బ్యాంకుల చర్యల కారణంగా రుణ ఎగవేతదారులు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. ఏండ్లుగా పేరుకుపోయి భారత ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారిన ఈ మొండి బకాయిలకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో.
-ఎడిటోరియల్ డెస్క్