CWC 2023: వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆడిన ఏడింటికి ఏడూ గెలిచి జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా విజయాలలో బౌలర్ల పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. కీలక మ్యాచ్లలో మన పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమీలు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. న్యూజిలాండ్, ఇంగ్లండ్పై దుమ్మురేపిన మన బౌలర్లు గురువారం ముంబైలోని వాంఖెడే వేదికగా జరిగిన మ్యాచ్లో కూడా ఇరగదీశారు. అయితే ప్రపంచకప్లో భారత బౌలర్లకు ఇతర జట్లకు ఇచ్చేవి కాకుండా ప్రత్యేకమైన బంతులు ఇస్తున్నారని అందుకే వాళ్లు వికెట్లు పడగొడుతున్నారని ఆరోపిస్తున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హసన్ రాజా.
శ్రీలంకపై భారత్ విజయదుందుభి మోగించిన తర్వాత హసన్ రాజా.. పాకిస్తాన్కు చెందిన ఓ టీవీ ఛానెల్ చర్చలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి నార్మల్గానే ఉంటుంది. కానీ వాళ్లు బౌలింగ్కు రాగానే బంతి ఆటోమేటిక్గా సీమర్స్కు అనుకూలంగా ఉండటంతో పాటు స్వింగ్ అవుతోంది. అదీగాక కొన్ని డీఆర్ఎస్ నిర్ణయాలు కూడా వారికి అనుకూలంగా మారుతున్నాయి. మరి ఐసీసీ భారత బౌలర్లకు సహకరిస్తుందో లేక బీసీసీఐ ప్రత్యేకమైన బంతులను అందజేస్తుందో తెలియడం లేదు..’అని కామెంట్స్ చేశాడు.
Former Pakistan cricketer Hasan Raza says the ICC or BCCI is giving different balls to Indian bowlers, and that’s why they are taking wickets. He wants this issue to be investigated 😱 #INDvSL #INDvsSL #CWC23 pic.twitter.com/2ThsgYDReg
— Farid Khan (@_FaridKhan) November 2, 2023
హసన్ రాజా చేసిన ఈ కామెంట్స్పై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆడలేక మద్దెల దరువు అన్నట్టు.. ప్రపంచకప్కు ముందు తమది వరల్డ్ నెంబర్ వన్ బౌలింగ్ యూనిట్ అని, తమ జట్టులో షహీన్ షా అఫ్రిది, హరీస్ రౌఫ్ వంటి ప్రపంచస్థాయి బౌలర్లు ఉన్నారని చెప్పుకున్న పాకిస్తాన్.. వరల్డ్ కప్లో నాలుగు పరాజయాలతో బొక్క బోర్లా పడిందని, ఆడటం చేతకానప్పుడు పాకిస్తాన్కు ఇలాంటి ఆరోపణలు చేయడం సర్వసాధారణమేనని వాపోతున్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు పాకిస్తాన్ ఇలాంటి కామెంట్స్ చేయదని చురకలు అంటిస్తున్నారు.