బహమాస్: భారత్కు చెందిన 4×400మీటర్ల(4x400m Relay Teams) మహిళల, పురుషుల జట్లు పారిస్లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించాయి. బహమాస్లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ రిలేస్ ఈవెంట్లో రెండో రౌండ్ హీట్స్లో రెండో స్థానంలో నిలిచారు. మహిళ విభాగంలో రూపల్ చౌదరీ, ఎంఆర్ పూవమ్మ, జ్యోతికా శ్రీదండి, సుభా వెంకటేశన్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. హీట్ నెంబర్ నవ్లో భారత మహిళల బృందం 3 నిమిషాల 29.35 సెకన్లలో రేస్ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచారు. ఆ రేసులో జమైకా బృందం తొలి స్థానంలో నిలిచింది.
పురుషుల విభాగంలో మహమ్మద్ అనాస్ యహియా, మొహమ్మద్ అజ్మల్, అరోకియా రాజీవ్, అమోజ్ జాకబ్ బృందం 4×400మీటర్ల రిలే ఈవెంట్ను 3 నిమిషాల 3.23 సెకన్లలో పూర్తి చేశారు. తమ హీట్లో ఈ బృందం రెండో స్థానంలో నిలుచున్నది. అమెరికా తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నది. అనాస్, అజ్మల్, అమోజ్లు కేరళవాసులు కాగా, రాజీవ్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. రెండవ రౌండ్కు చెందిన మూడు హీట్స్లో టాప్ టూలో ఉండే బృందాలను ఒలింపిక్స్కు ఎంపిక చేస్తారు. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్ ఒలింపిక్స్ క్రీడలు జరగనున్న విషయం తెలిసిందే.