న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్(Test Series)లో.. నాగపూర్, ఢిల్లీ నగరాల్లో తొలి రెండు టెస్టులు జరిగిన విషయం తెలిసిందే. ఆ రెండు టెస్టులు కూడా మూడు రోజుల్లోనే ముగిశాయి. విదర్భ, జైట్లీ స్టేడియాల్లో జరిగిన ఆ మ్యాచ్ల్లో స్పిన్ బౌలర్లు తమ తడాఖా చూపించారు. టెస్టు సిరీస్ రసవత్తరంగా సాగుతుందని భావించిన తరుణంలో.. తొలి రెండు టెస్టులు దాదాపు ఏకపక్షంగా ముగిశాయి.
అయితే ఆ పిచ్ల గురించి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ఓ రిపోర్టును తయారు చేసినట్లు తెలుస్తోంది. ఆ రెండు పిచ్లకు యావరేజ్ రేటింగ్(Average Rating) కూడా ఇచ్చినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కథనం ద్వారా స్పష్టమవుతోంది. ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ రిపోర్టును ఇచ్చినట్లు తెలుస్తోంది.
నాగపూర్లోని విదర్భ క్రికెట్ సంఘం స్టేడియం పిచ్ యావరేజ్గా ఉన్నట్లు ఆండీ పైక్రాఫ్ట్ తెలిపారు. తొలి టెస్టులో ఇండియా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ మూడవ రోజే ముగసింది. ఆ పిచ్కు కూడా యావరేజ్ రేటింగ్ ఇచ్చాడు పైక్రాఫ్ట్.
ఇప్పటికే సిరీస్లో 2-0 తేడాతో ఇండియా ఆధిపత్యాన్ని చాటింది. ఇక మూడవ టెస్టు మార్చి ఒకటో తేదీ నుంచి ఇండోర్లో జరగనున్నది.