ICC : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy) మూడో టెస్టుకు వేదికైన ఇండోర్ పిచ్(Indore pitch)పై ఐసీసీ కీలక నిర్ణయం ప్రకటించింది. పిచ్ అధ్వాన్నంగా ఉందని చెప్పి, మూడు డీ మెరిట్ పాయింట్లు విధించిన ఐసీసీ దిగొచ్చింది. బీసీసీఐ సమర్పించిన ఇండోర్ టెస్టు పుటేజీ పరిశీలించిన అత్యున్నత క్రికెట్ మండలి అప్పీల్ ప్యానెల్ పిచ్ను ‘బిలో యావరేజ్’గా ప్రకటించింది.
ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్(Wasim Khan), ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ సభ్యుడు రోజర్ హర్పర్ (Roger Harper) ఈరోజు తమ నిర్ణయం వెల్లడించారు. ఐసీసీ పిచ్, ఔట్ఫీల్డ్ నిబంధనల ప్రకారం ఏదైనా పిచ్కు ఐదు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు వస్తే.. ఒక ఏడాది పాటు ఆ స్టేడియంపై నిషేధం విధిస్తారు.
ఇండోర్ టెస్టులో ఆసీస్ పది వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడో రోజు లంచ్ లోపే ఆట ముగియడంతో మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఐసీసీకి రిపోర్ట్ పంపించాడు. అందులో.. ‘పిచ్ చాలా పొడిగా ఉంది. బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరించలేదు. మొదటి నుంచే స్పిన్నర్లకు అనుకూలించింది’ అని తెలిపాడు. దాంతో ఇండోర్ పిచ్ ‘అధ్వాన్నం’గా ఉందని ఐసీసీ పేర్కొంది. అంతేకాదు మూడు డీమెరిట్ పాయింట్లు కూడా విధించింది. ఐసీసీ నిర్ణయంతో ఏకీభవించని బీసీసీఐ అప్పీల్ చేసింది. దాంతో, ఐసీసీ ప్యానెల్ తమ నిర్ణయం మార్చుకుంది.
అహ్మదాబాద్లో జరిగిన ఆఖరి టెస్టులో విరాట్ కోహ్లీ శతకంతో మెరిశాడు. ఆ టెస్టు డ్రాగా ముగియడంతో టీమిండియా 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది. దాంతో, ప్రతిష్ఠాత్మకమైన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని భారత జట్టు నాలుగోసారి నిలబెట్టుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సిరీస్లో అత్యుత్తమంగా రాణించిన భారత సీనియర్ స్పిన్నర్ రవించంద్రన్ అశ్విన్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యారు.