దుబాయ్: టెస్టు ర్యాంకింగ్స్లో ఇండియా టాప్ ప్లేస్లో ఉన్నట్లు బుధవారం ఐసీసీ తొలుత ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కొన్ని నిమిషాలకే మరో అప్డేట్లో ఆస్ట్రేలియా నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నది. బుధవారం జరిగిన సాంకేతిక లోపం పట్ల ఇవాళ అంతర్జాతీయ క్రికెట్ మండలి క్షమాపణలు చెప్పింది. ప్రస్తుతం రోహిత్ శర్మ సేన రెండవ స్థానంలో ఉంది.
ఆస్ట్రేలియా కాకుండా ఇండియా టాప్లో ఉన్నట్లు ర్యాంక్ ఇచ్చిన విషయాన్ని అంగీకరించిన ఐసీసీ తన తప్పును ఒప్పుకున్నది. దీనిపై ప్రకటన చేస్తూ.. ఫిబ్రవరి 15వ తేదీన కొంత సమయం పాటు సాంకేతిక లోపం వల్ల తమ వెబ్సైట్లో ఇండియాను టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ స్థానంలో చూపామని ఐసీసీ పేర్కొన్నది. తమ వల్ల కలిగిన పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నట్లు ఐసీసీ తెలిపింది.
ప్రస్తుతం 126 రేటింగ్ పాయింట్లతో టెస్టుల్లో ఆస్ట్రేలియా తొలి ర్యాంక్లో నిలిచింది. ఇక 11 పాయింట్ల తేడాతో ఇండియా రెండవ స్థానంలో నిలిచింది. శుక్రవారం నుంచి ఇండియా, ఆసీస్ మధ్య రెండో టెస్టు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ రెండు జట్లు జూన్లో జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్షిప్పై కన్నేసిన విషయం తెలిసిందే.