ICC : క్రికెట్లో కొత్త అధ్యాయానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) నాంది పలికింది. ఆట ఒకటే అయినప్పుడు ప్రైజ్మనీలో ఎక్కువ, తక్కువలు ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానంగా ఐసీసీ ఈరోజు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)లో విజేతగా నిలిచిన మహిళల క్రికెట్(Womens Team) జట్లకు పురుషుల జట్ల(Mens Team)తో సమానంగా ప్రైజ్మనీ ఇస్తున్నట్టు వెల్లడించింది. అంతేకాదు రెండో, మూడో స్థానంలో నిలిచిన వాళ్లకు కూడా ఒకే ప్రైజ్మనీ ఇస్తామని స్పష్టం చేసింది. డర్బన్లో జరిగిన ఐసీసీ కార్యవర్గం వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.
‘క్రికెట్ చరిత్రలో ఇదొక ముఖ్యమైన అధ్యాయం. ఇకనుంచి ఐసీసీ ట్రోఫీల్లో తలపడే మహిళా జట్లకు పురుష జట్లతో సమానమైన ప్రైజ్మనీ ఇస్తాం. విమెన్, మెన్స్ టీమ్లకు ఒకటే ప్రైజ్ మనీ ఇవ్వాలనే ఉద్దేశంతో 2017 నుంచి ప్రతి ఏడాది మహిళల క్రికెట్ టీమ్లకు ప్రైజ్మనీని పెంచుతూ వస్తున్నాం. ఈరోజుతో మేము అనుకున్నది సాధించాం’ అని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్లే(Greg Barclay) తెలిపాడు. 2030లోపు క్రికెట్లో ఈ మార్పు తీసుకురావాలని ఐసీసీ అనుకుంది. అయితే.. ఏడేళ్ల ముందుగానే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
నిరుడు టీ20 వరల్డ్ కప్ నెగ్గిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్
ఈ ఏడాది మహిళల టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు రూ. 8 కోట్లు దక్కాయి. రన్నరప్ ఇంగ్లండ్కు రూ. 4 కోట్లు ముట్టాయంతే. కానీ, పొట్టి ప్రపంచ కప్ నెగ్గిన పురుషుల ఇంగ్లండ్ జట్టుకు రూ. 13 కోట్ల ప్రైజ్మనీ అందింది. రన్నరప్ పాకిస్థాన్కు ఆరున్నర కోట్లు బహుమతిగా లభించాయి. అయితే.. ఐసీసీ తాజా నిర్ణయంతో ఇకనుంచి పురుషుల, మహిళల జట్లకు సమానంగా ప్రైజ్మనీ దక్కనుంది.