Ravichandran Ashwin: వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)లో తొలి టెస్టులోనే భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) అదరగొట్టాడు. ఐదు వికెట్లతో ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం కెరీర్లో 33వ సారి. మ్యాచ్ అనంతరం మాట్లాడిన అశ్విన్ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final 2023) తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోవడంపై స్పందించాడు. గతంలోనూ ఈ అంశంపై మాట్లాడిన అతను పదే పదే ఒకే సమాధానం చెప్పడం ఇబ్బందికరంగా ఉంటుందని అన్నాడు.
‘ఇంతకుముందే ఈ అంశంపై స్పందించాను. డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి కీలక మ్యాచ్కు దూరం కావడం ఏ ఆటగాడికైనా కష్టంగానే ఉంటుంది. ఇంగ్లండ్కు వెళ్లినప్పుడు ఫైనల్ కోసం మానసికంగా సిద్ధంగా ఉన్నా. అంతేకాదు ఫిట్నెస్తో ఉన్నా. మ్యాచ్లో ఎలా ఆడాలి? ఎలా బౌలింగ్ చేయాలి? ఏ ఆటగాడికి ఎలాంటి బంతులు వేయాలి? ఇలా అన్నీ ఆలోచించుకున్నా. అదే సమయంలో తుది జట్టులో చోటు దక్కకపోతే ఎలా? అనేదానికి కూడా సిద్ధమయ్యాను’ అని అశ్విన్ వెల్లడించాడు.
5 వికెట్లు తీసిన అశ్విన్కు కోహ్లీ అభినందన
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సర్కిల్ను భారత్ ఘనంగా మొదలు పెట్టింది. వెస్టిండీస్తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ ఫీట్తో అతను మూడు ఫార్మాట్లలో 700 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా నిలిచాడు. కెరీర్లో 33వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన అశ్విన్.. కరీబియన్ జట్టు కుప్పకూలడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం యాష్ మాట్లాడుతూ.. ‘పిచ్ నుంచి స్పిన్నర్లకు పూర్తి సహకారం లభిస్తున్నది. వికెట్ మీద కొంత బౌన్స్ ఉండటం కూడా కలిసొచ్చింది. స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై వికెట్లు తీసేందుకు ఎక్కువ ఇబ్బంది పడాల్సి రాలేదు’ అని తెలిపాడు.