Saina Nehwal : భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్(Saina Nehwal) బ్యాడ్మింటన్కు బ్రేక్ ఇచ్చింది. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) జరుగనున్న నేపథ్యంలో తోటి షట్లర్లంతా ర్యాంకింగ్ మెరుగు పర్చుకునేందుకు బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ సిరీస్(World Badminton Tour Series)లు ఆడుతుంటే.. సైనా మాత్రం దైవనామ స్మరణతో తన్మయత్వానికి గురవుతోంది. ఈ స్టార్ షట్లర్ ఫ్యామిలీతో కలిసి అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra)కు వెళ్లింది. అక్కడ మంచు గుహల్లో కొలువుదీరిన పరమేశ్వరుడిని దర్శించుకుంది. ఎంతో వ్యయప్రయాసలతో కూడిన ఈ యాత్రను సైనా విజయవంతంగా పూర్తి చేసుకుంది.
అమ్మ ఉష(Usha Nehwal)తో కలిసి అమరనాథ్ మంచు లింగాన్ని దర్శించుకోవడం మరచిపోలేని అనుభూతి అని సైనా సామాజిక మాధ్యమాల్లో పేర్కొంది. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి సైనా అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నది. ప్రస్తుతం ఆ ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
బల్తాల్ బేస్ క్యాంప్ వద్ద తల్లి ఉషతో సైనా
కాలి నడక ద్వారా పరమేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంది సైనా. అందుకని సోన్ మార్గ్ నుంచి బయల్దేరి అమర్నాథ్ యాత్రను పూర్తి చేసుకుంది. బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి తల్లి ఉషాతో కలిసి యాత్రను మొదలు పెట్టిన సైనా అవరోధాలన్నీ దాటుకొని అనుకున్నది సాధించింది. మంచు లింగం దర్శనం అనంతరం సైనా మాట్లాడుతూ.. ‘చాన్నాళ్లుగా అమరనాథుడిని దర్శించుకోవాలనుకున్నా.
సైనా నెహ్వాల్
చాలామంది ఈ యాత్ర గురించి గొప్పగా చెప్పారు. దీంతో పాటు ఒకింత కష్టమైనదని కూడా విన్నాను. మొత్తానికి యాత్రను విజయవంతంగా పూర్తి చేసిందనుకు చాలా ఆనందంగా ఉంది. అమర్నాథ్ యాత్ర అంటేనే భక్తి పారవశ్యతకు మారుపేరు. అధికారుల సాయంతో యాత్ర చాలా బాగా సాగింది’ అని వెల్లడించింది. సైనా భర్త పారుపల్లి కశ్యప్(Parupalli Kashyap) ప్రస్తుతం యూఎస్ ఓపెన్(US Open)బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొంటున్నాడు.