గత నెలలో ముగిసిన ఐపీఎల్-15 లో తనదైన వేగంతో పాటు వైవిధ్యమైన బంతులు వేసి అందరి మన్ననలు పొందాడు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. నిలకడగా గంటకు 150 కిలోమీటర్ల కంటే వేగంతో బౌలింగ్ చేస్తున్న ఈ జమ్మూ కుర్రాడిపై తాజాగా దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్త్జ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఎవరు ఎక్కువ వేగంతో బౌలింగ్ చేయడం ముఖ్యం కాదని చెప్పిన నోర్త్జ్.. తమ బౌలింగ్ జట్టుకు ఎంత ఉపయోగపడిందన్నదే ముఖ్యమని చెప్పాడు.
ఇండియా-సౌతాఫ్రికా మధ్య రాజ్కోట్ వేదికగా జరుగబోయే టీ20 మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా నోర్త్జ్ మాట్లాడుతూ..‘ఎవరు వేగంగా బౌలింగ్ చేస్తున్నారన్నది ముఖ్యం కాదు. ఈ పరిస్థితుల్లో వేగం కంటే జట్టును గెలిపించడం ముఖ్యం. నేను మ్యాచులు ఆడనప్పుడు, ట్రైనింగ్ లో ఉన్నప్పుడు దాని (వేగం) గురించి ఆలోచించాలి. కానీ గ్రౌండ్ లోకి వెళ్లాక జట్టు కోసం మనం ఏం చేయగలమో అదే చేయాలి..
ఉమ్రాన్ మంచి బౌలర్. అతడిలో మంచి వేగం ఉంది. తాను ఏం చేయగలనో దానిని ఐపీఎల్ లో చేసి చూపించాడు. ఒకవేళ అతడు రానురాను మరింత వేగంగా బౌలింగ్ చేస్తే అది అతడికి మంచిది. నేను బాగా బౌలింగ్ చేస్తే నాకూ మంచిది. మేమిద్దరం ఇప్పుడు ఎవరు ఫాస్ట్ గా బౌలింగ్ చేస్తారనే స్టేజ్ లో లేము. జట్టు గెలపు కోసం ఏం చేయాలి..? అనేదే ముఖ్యం..’ అని చెప్పాడు.
ఐపీఎల్ లో రాణించిన ఉమ్రాన్ కు దక్షిణాఫ్రికా సిరీస్ లో చోటు దక్కింది. అయితే మూడు మ్యాచులు ముగిసినా ఇంతవరకు ఆడే అవకాశం దక్కలేదు. కానీ రాజ్కోట్ లో జరుగబోయే నాలుగో మ్యాచ్ లో అవేశ్ ఖాన్ స్థానంలో మాలిక్ కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.