భారత క్రికెట్ జట్టులో అలజడి! ఇన్నాళ్లు సాఫీగా సాగిన ప్రయాణంలో అనుకోని ఒడిదుడుకులు. నాయకత్వ బదిలీ విషయంలో ఏర్పడిన వివాదం చినికిచినికి గాలి వానలా మారుతున్న వైనం. వెరసి టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా భేటీ బీసీసీఐలో ప్రకంపనలు సృష్టిస్తున్న వైనం. బోర్డు పెద్దల వైఖరి, వ్యవహారశైలిని దునుమాడుతూ విరాట్ ఖుల్లంఖుల్లా మాట్లాడాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేసిన విరాట్..టీ20 కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ బాస్ గంగూలీ వ్యాఖ్యలకు విరుద్ధంగా అసలు అలాంటి ప్రతిపాదన రాలేదన్నాడు. అంతటితో ఆగకుండా వన్డే కెప్టెన్సీపై గంటన్నర ముందు సమాచారమిచ్చి సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయంపై కోహ్లీ తనదైన శైలిలో సమాధానం చెప్పుకొచ్చాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్శర్మతో ఎలాంటి విభేదాల్లేవని చెప్పిచెప్పి అలసిపోయానన్న కోహ్లీ.. జట్టు ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమని స్పష్టం చేశాడు. బుధవారం వర్చువల్ మీడియా భేటీలో కోహ్లీ పలు అంశాలపై స్పష్టతనిచ్చాడు.
న్యూఢిల్లీ/ముంబై: సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ చోటు చేసుకోని సందర్భం. నాయకత్వ మార్పిడి విషయంలో అవలంభించిన బోర్డు వైఖరిని ఎండగడుతూ టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దిమ్మతిరిగే రీతిలో కౌంటర్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా పర్యటన కోసం బుధవారం బయల్దేరి వెళ్లడానికి ముందు కెప్టెన్ హోదాలో కోహ్లీ వర్చువల్ మీడియా సమావేశంలో పలు కీలక అంశాలపై స్పష్టత ఇచ్చాడు. ఇందులో టీ20 కెప్టెన్సీకి రాజీనామా, వన్డే నాయకత్వం నుంచి తొలగింపు, రోహిత్శర్మతో విభేదాలు, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి విరామం, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యలకు విరాట్ విరుద్ధంగా స్పందించిన తీరు అతని మాటల్లోనే..
గంటన్నర ముందు చెప్పారు..
ఈనెల 8న దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు జట్టు ఎంపిక కోసం సెలెక్షన్ కమిటీ సమావేశమైంది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్న విషయం..సెలెక్టర్ల సమావేశానికి సరిగ్గా గంటన్నర ముందు చెప్పారు. అంతకుమించి నాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పటి నుంచి నాతో బోర్డు తిరిగి మాట్లాడింది లేదు. టెస్టు జట్టు ఎంపికపై చీఫ్ సెలెక్టర్ చేతన్శర్మ నిర్ణయంతో నేను ఏకీభవించాను. అయితే ఐదుగురు సెలెక్టర్లు వన్డే కెప్టెన్సీ విషయంలో నన్ను తప్పిస్తున్నట్లు చెప్పారు. దానికి నేను ‘ఓకే ఫైన్’ అని సమాధానిమిచ్చాను. సెలెక్షన్ కమిటీ సమావేశం తర్వాత ఏం జరిగిందన్న దానిపై మేం చాటింగ్ ద్వారా చర్చించుకున్నాం.