Sreeja Akula | న్యూఢిల్లీ: హంగ్జు(చైనా) వేదికగా సెప్టెంబర్లో జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్ కోసం శుక్రవారం భారత టేబుల్ టెన్నిస్ జట్టును ప్రకటించారు. ఇందులో తెలంగాణ యువ ప్యాడ్లర్లు ఆకుల శ్రీజ, ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్.. భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య(టీటీఎఫ్ఐ) శుక్రవారం సమావేశమై కొరియాలో జరిగే ఆసియా చాంపియన్షిప్తో పాటు ఏషియన్ గేమ్స్కు జట్టును ఎంపిక చేసింది.
గత కొంత కాలంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శ్రీజ, స్నేహిత్ నిలకడగా రాణిస్తున్నారు. ముఖ్యంగా శ్రీజ మంచి ఫామ్మీదుంది. గతేడాది జరిగిన బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ మిక్స్డ్ డబుల్స్లో శరత్ కమల్తో కలిసి పసిడి పతకంతో మెరిసింది. తాను పోటీకి దిగిన ప్రతీ టోర్నీలోనూ శ్రీజ సత్తాచాటుతూ పతకాలు కొల్లగొడుతున్నది. అంచనాలకు మించి రాణిస్తున్న యువ ప్యాడ్లర్ స్నేహిత్కు ఇది తొలి ఆసియాగేమ్స్. రిజర్వ్ ప్లేయర్గా ఎంపికైన స్నేహిత్ అవకాశం వస్తే సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. తన కెరీర్లో ఆఖరి ఆసియా గేమ్స్ ఆడుతున్న దిగ్గజ ప్యాడ్లర్ శరత్ కమల్తో పాటు సాతియాన్, హర్మీత్దేశాయ్, మానవ్ థక్కర్, మానుష్ షా ఉన్నారు. మరోవైపు మహిళల జట్టులో మనికా బాత్రా, శ్రీజ, సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ, దియా చితాలే పోటీపడనున్నారు. ఆసియా గేమ్స్ నిబంధనల దృష్ట్యా శరత్, సాతియాన్, మనిక, శ్రీజ సింగిల్స్ మ్యాచ్లు ఆడనున్నారు. మహిళల డబుల్స్లో దియాతో కలిసి శ్రీజ పోటీ పడనుండగా, ఐహిక, సుతీర్థ కలిసి ఆడుతారు. ప్రస్తుత ఫామ్, ప్రపంచ ర్యాంకింగ్స్ను పరిగణనలోకి తీసుకుంటూ సెలెక్టర్లు ప్లేయర్లను ఎంపిక చేశారు.
భారత పురుషుల జట్టు: శరత్ కమల్, సాతియాన్, హర్మీత్దేశాయ్, మానవ్ థక్కర్, మానుష్ షా, రిజర్వ్ ప్లేయర్లు: స్నేహిత్, సనిల్శెట్టి,మహిళల జట్టు: మనికా బాత్రా, శ్రీజ, సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ, దియా చితాలే, రిజర్వ్ ప్లేయర్లు: అర్చనా కామత్, రీత్ రిష్య.