దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్లో హైదరాబాద్ అదరగొట్టింది. చిన్న జట్ల మధ్య పెద్దన్నలా.. పూర్తి ఆధిపత్యంతో ప్లేట్ గ్రూప్ విజేతగా నిలిచింది. లీగ్ దశలో ఆడిన అన్నీ మ్యాచ్ల్లోనూ బోనస్ పాయింట్లు సాధించిన హైదరాబాద్.. ఫైనల్లోనూ సత్తాచాటింది. కెప్టెన్ తిలక్ వర్మ, రాహుల్ సింగ్ రాణించడంతో అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి.. వచ్చే ఏడాది ఎలైట్ గ్రూప్కు అర్హత సాధించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీజన్లో నిలకడగా రాణించిన హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ విజేతగా నిలిచింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంర్జాతీయ స్టేడియంలో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో మేఘాలయను చిత్తుచేసింది. గ్రూప్ దశలో ఆడిన ఐదు మ్యాచ్ల్లో గెలిచిన మన జట్టు.. అజేయంగా ప్లేట్ లీగ్ను ముగించింది. 198 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 71/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ చివరకు 5 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (64; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రాహుల్ సింగ్ (62; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు.
అంతకుముందు మేఘాలయ తొలి ఇన్నింగ్స్లో 304 పరుగులు చేయగా.. హైదరాబాద్ 350 రన్స్ కొట్టింది. రెండో ఇన్నింగ్స్లో మేఘాలయ 243 పరుగులు కొట్టింది. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి తనయ్ త్యాగరాజన్ 10 వికెట్లు పడగొట్టగా.. తొలి ఇన్నింగ్స్లో భారీ సెంచరీ చేసిన నితీశ్ రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ ఏడాది ప్రదర్శనతో హైదరాబాద్ జట్టు.. వచ్చే సీజన్ రంజీ ట్రోఫీకి ఎలైట్ గ్రూప్లో చోటు దక్కించుకోనుంది. విజేతగా నిలిచిన హైదరాబాద్కు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. దీనికి తోడు కెప్టెన్ తిలక్వర్మ, తన్మయ్, తనయ్, నితీశ్, ప్రజ్ఞయ్కు 50వేల ప్రత్యేక బహుమతి అందజేశారు.
నిరుడు పేలవ ప్రదర్శన కారణంగా.. ప్లేట్ గ్రూప్కు పడిపోయిన హైదరాబాద్.. ఈసారి ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. అరుణాచల్ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కీంతో కలిసి ప్లేట్ గ్రూప్లో పోటీ పడిన హైదాబాద్.. గ్రూప్ దశలో ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ ఇన్నింగ్స్ తేడాతో విజయాలు సాధించింది. నాగాలాండ్తో జరిగిన తొలి పోరులో కెప్టెన్ తిలక్ వర్మ సెంచరీ, రాహుల్ డబుల్ సెంచరీతో కదంతొక్కడంతో.. హైదరాబాద్ 474/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. ఆ తర్వాత నాగాలాండ్ రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 153, 127 పరుగులకు ఆలౌటైంది. మేఘాలయతో జరిగిన రెండో మ్యాచ్కు తిలక్ అందుబాటులో లేకపోగా.. రోహిత్ రాయుడు అజేయంగా 124 రన్స్ కొట్టడంతో మన జట్టు 346/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. ప్రత్యర్థి రెండు ఇన్నింగ్స్ల్లో 111, 154 పరుగులే చేశాయి. సిక్కీంతో జరిగిన మూడో మ్యాచ్లో తిలక్ (103*), తన్మయ్ (137) రాణించడంతో మన టీమ్ 463/4 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. ప్రత్యర్థి 79, 186 పరుగులకే కుప్పకూలింది.
అరుణాచల్తో జరిగిన పోరులో తన్మయ్ అగర్వాల్ (181 బంతుల్లో 366; 34 ఫోర్లు, 26 సిక్సర్లు) పాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కడంతో.. హైదరాబాద్ 615/4 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. ప్రత్యర్థి 172, 256 రన్స్కు పరిమితమైంది. ఆఖరి లీగ్ మ్యాచ్లో రాహుల్ సింగ్ (108), నితీశ్ రెడ్డి (115) సెంచరీలు బాదడంతో మన జట్టు 465/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. మిజోరాం 199, 193 రన్స్కు పరిమితమైంది. ఇలా లీగ్దశలో ఆడిన అన్నీ మ్యాచ్ల్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన హైదరాబాద్కు వచ్చే ఏడాది అసలు సిసలు సవాలు ఎదురు కానుంది. ప్లేట్ గ్రూప్ విజేతగా నిలిచిన అనంతరం హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ జట్టుకు రంజీ ట్రోఫీ అందించడమే నాలక్ష్యం. నిరుడు అనుభవం ఉన్న ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో.. ప్లేట్ గ్రూప్కు పరిమితం కావాల్సి వచ్చింది. ఈసారి మనవాళ్లందరూ మంచి ఫామ్ కనబర్చారు.
ఎలైట్ గ్రూప్లోనూ ఇదే దూకుడు కొనసాగిస్తూ.. ట్రోఫీ చేజక్కించుకునేందుకు ప్రయత్నిస్తాం. ప్లేట్ నుంచి నేరుగా రంజీ ట్రోఫీ గెలువడం మామూలు విషయం కాదు. నాకు ఆటంటే అమితమైన ఇష్టం. రెడ్ బాల్, వైట్ బాల్ అనే తేడా లేదు. ఏ అవకాశం వస్తే దాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్లాలనుకుంటున్నా. అతి త్వరలోనే భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకుంటాననే నమ్మకం ఉంది’ అని పేర్కొన్నాడు.
హైదరాబాద్ క్రికెట్ టీమ్కు అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. రానున్న మూడు సీజన్లలో హైదరాబాద్ ఎలైట్ టైటిల్ గెలిస్తే జట్టులో ఒక్కో క్రికెటర్కు బీఎండబ్ల్యూ కార్లు బహుమతి ఇస్తామని ప్రకటించారు. దీనికి తోడు జట్టుకు కోటి రూపాయల నగదు ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. ప్లేట్ నుంచి ఎలైట్కు చేరుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. వచ్చే సీజన్లో ఎలైట్ గ్రూపులో హైదరాబాద్ సత్తాచాటాలని జగన్ ఆకాంక్షించారు. ఇందుకు హెచ్సీఏ తరఫున జట్టుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్సీఏ కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మేఘాలయ తొలి ఇన్నింగ్స్: 304; హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 350;మేఘాలయ రెండో ఇన్ని్ంగస్: 243; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: 203/5 (తిలక్ 64, రాహుల్ 62; సంగ్మా 3/47).