హైదరాబాద్, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ మరో అంతర్జాతీయ ఈవెంట్కు ఆతిథ్యమివ్వబోతున్నది. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, షూటింగ్ లాంటి క్రీడలకు హబ్గా వెలుగొందుతున్న భాగ్యనగరంలో ఫార్ములా-ఈ రేసు తళుకులీనబోతున్నది. నగర రోడ్లపై రయ్ రయ్ అంటూ దూసుకెళుతూ అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. తొమ్మిదో సీజన్లో భాగంగా హైదరాబాద్లో వచ్చే ఫిబ్రవరిలో ఫార్ములా-ఈ రేసు జరుగనుంది. నగరం నడిఒడ్డున హుసేన్సాగర్ తీరాన రేసు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలో మొదటిసారి మన దగ్గర నిర్వహించబోతున్న రేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నది. ఎక్కడా లోపాలకు తావులేకుండా ట్రాక్ను సిద్ధం చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నది. ఇప్పటికే రేసుకు సంబంధించి పనులను పరిశీలించిన నిర్వాహక బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్ పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ఫార్ములా-ఈ రేసుకు సంబంధించి శుక్రవారం మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్చాట్లో మంత్రి కేటీఆర్ స్పందించారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు హబ్గా హైదరాబాద్ను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. ఇప్పటికే దేశంలో ఈవీలపై ప్రత్యేక పాలసీ తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దీనికి మరింత ఊతమిచ్చే విధంగా ఈ-మొబిలిటీ వీక్ ఉండబోతున్నది. హైటెక్స్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు జరిగే కార్యక్రమాల లోగో, వెబ్సైట్ను మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి ప్రారంభించాం. దేశ, విదేశాల నుంచి ఈ సమ్మిట్కు రాబోతున్నారు. ఈ లోపే నూతన సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మృతి చిహ్నం ఈ మూడింటిని ప్రారంభించాలనుకుంటున్నాం. ఫార్ములా-ఈ రేసు నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఆసక్తి నెలకొన్నది. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. దేశ, విదేశాల నుంచి వచ్చే ఈవీ రంగ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఆయా కంపెనీల యజమానులు, షో నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా ఫిబ్రవరి 11న రేసును దేశం దృష్టిని ఆకర్షించేలా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం. రేసింగ్ జరిగే 2.37 కి.మీల ట్రాక్ను ఫార్ములా-ఈ నిబంధనలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నాం. దాదాపు 50వేల మంది అభిమానులు రేసును స్వయంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నాం. ఫార్ములా-ఈ రేసును రాష్ట్ర ప్రభుత్వ ఈవెంట్గా కాకుండా ఇండియా సమ్మిట్లా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రెండు రోజుల పాటు జరిగే రేసుకు దాదాపు రూ.80 నుంచి రూ.90 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాం.