రాష్ట్ర ప్రభుత్వం సాట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్-2023 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆయా జిల్లాల నుంచి ప్లేయర్లు వివిధ క్రీడాంశాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పతకాలే లక్ష్యంగా దూసుకెళుతూ క్రీడాభిమానులను అలరిస్తున్నారు. నగరంలోని ఆరు స్టేడియాల్లో 18 క్రీడాంశాల్లో పతకాలు కొల్లగొట్టేందుకు పట్టుదల కనబరుస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని పుణికిపుచ్చుకుంటూ సత్తాచాటాలన్న కసి ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర క్రీడా చరిత్రలో ఇదో నూతన అధ్యాయమని పేర్కొన్న సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పతక విజేతలను అభినందించారు. నేడు జరిగే టోర్నీ ముగింపు వేడుకల్లో పతకాలతో పాటు నగదు పురస్కారాలు అందించనున్నారు.
నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి/జూబ్లీహిల్స్: సీఎం కప్-2023 టోర్నీలో పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. మండల, జిల్లా స్థాయి టోర్నీల్లో సత్తాచాటి రాష్ట్ర స్థాయిలో తలపడుతున్న ప్లేయర్లు పతకాలు కైవసం చేసుకునేందుకు కడదాకా పోరాడుతున్నారు. నగరంలోని ఆరు ప్రధాన స్టేడియాల్లో ఆయా క్రీడాంశాల్లో ప్లేయర్ల ప్రదర్శన అదుర్స్ అనిపిస్తున్నది. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ సత్తాచాటాలన్న పట్టుదల గ్రామీణ ప్రాంత ప్లేయర్లలో కసిగా కనిపిస్తున్నది. మంగళవారం వేర్వేరు స్టేడియాల్లో జరిగిన పోటీలు అందరనీ ఆకట్టుకున్నాయి.
సీఎం కప్-2023 పోటీల రెజ్లింగ్ 65 కేజిల విభాగంలో హైదరాబాద్ జిల్లాకు చెందిన ఎండీ ఫరీద్ షాహిల్ స్వర్ణ పతకంతో మెరువగా, వరుణ్ రజతం (రంగారెడ్డి), శ్రీనివాస్ కాంస్యం (కామారెడ్డి) పతకాలు సొంతం చేసుకున్నారు. పురుషుల 74కిలోల విభాగంలో సయ్యద్ అబ్దుల్లా (స్వర్ణం), చరణ్(రజతం, సంగారెడ్డి), జే రాజు (కాంస్యం, రంగారెడ్డి) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. మరోవైపు బాస్కెట్బాల్ మహిళల క్వార్టర్స్లోహైదరాబాద్ జిల్లా 39-5 స్కోరుతో భద్రాద్రి కొత్తగూడెంపై, జగిత్యాల 21-3 స్కోరుతో హనుమకొండపై , మేడ్చల్ మల్కాజ్గిరి 40-19 స్కోరుతో నిజామాబాద్పై, రంగారెడ్డి 37-31 స్కోరుతో ఖమ్మంపై గెలిచి ముందంజ వేశాయి. పురుషుల క్వార్టర్స్లో హైదరాబాద్ జిల్లా 46-13 స్కోరుతో భద్రాద్రి కొత్తగూడెంపై, జగిత్యాల 83-80 స్కోరుతో హనుమకొండపై, మేడ్చల్ మల్కాజ్గిరి 50-19 స్కోరుతో మహబూబ్నగర్పై, రంగారెడి ్డ 59-39 స్కోరుతో ఖమ్మంపై గెలిచాయి. ఈ సందర్భంగా క్రీడాకారులకు పతకాలతో పాటు మెరిట్ సర్టిఫికేట్లను సాట్స్ చైర్మన్ డా. ఆంజనేయగౌడ్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రవీందర్తో పాటు రంగారెడ్డి డీఆర్డీవో ప్రభాకర్, సంగారెడ్డి డీవైఎస్వో రామచందర్, రెజ్లింగ్ కోచ్ నర్సింగ్రావు పాల్గొన్నారు. క్రీడాకారుల బంగారు భవిష్యత్కు బాటలు వేసేందుకు సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని సాట్స్ చైర్మన్ పేర్కొన్నారు. క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.
సీఎం కప్ టోర్నీలో విజేతలకు సాట్స్ నగదు పురస్కారాలు అందజేయనుంది. టీమ్ ఈవెంట్లలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు లక్ష రూపాయలు, ద్వితీయ స్థానానికి 75వేలు, తృతీయ స్థానానికి 50 వేలు దక్కనున్నాయి.